ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీ వైసీపీకి మరో భారీ షాకే తగలనుంది. అధికార పార్టీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’లో భాగంగా ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఝలక్కిచ్చి టీడీపీలో చేరిపోయారు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి కూడా సైకిల్ ఎక్కేయగా, తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి పెను షాకే తగలనుందన్న సంకేతాలను రాజకీయ వర్గాల నుండి వ్యక్తమవుతున్నాయి.
రాజమహేంద్రవరానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఊపందుకుంది. గతంలో టీడీపీ నేతగానే ఉన్న ఆదిరెడ్డి గడచిన ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. ఆదిరెడ్డి సామాజిక వర్గాన్ని మరింత దగ్గర చేసుకునేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాడు అందివచ్చిన ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీటును అందరినీ కాదని ఆదిరెడ్డికి ఇచ్చేసిన విషయం తెలిసిందే.
అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆదిరెడ్డి తన సొంత గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఓ ప్రముఖ దినపత్రిక కధనాలను ప్రసారం చేసింది. టీడీపీకి చెందిన దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడుకు వియ్యంకుడైన ఆదిరెడ్డి… రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లాకు చెందిన సీనియర్ నేత గన్ని కృష్ణలు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని పక్షంలో అతి త్వరలోనే సైకిల్ ఎక్కేయడం ఖాయంగా కనపడుతోంది.



