అశేష ప్రేక్షక ఆదరణ చూరగొంటూ కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన రాజమౌళి “బాహుబలి 2”పై ఇప్పటివరకు ప్రశంసలు మాత్రమే లభించాయి. నిజానికి పార్ట్ 1 సినిమాపై విమర్శలు గుప్పించిన వారు కూడా, పార్ట్ 2ను ఆకాశానికేత్తెస్తూ అభిప్రాయపడ్డారు. కానీ తాజాగా ‘బాహుబలి 2’పై కూడా విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇదేదో సినిమా చూసేసి నచ్చక చెప్పే విమర్శలు కాదు, అసలు ఇలాంటి సినిమాలు చూడడమే వృధా అన్న కోణంలో అభిప్రాయపడుతున్న విమర్శలు. ఇంతకీ అంతటి విమర్శలు ఎవరు చేసారో తెలుసా..?
ప్రముఖ కథా రచయిత, సీనియర్ దర్శకుడు అయిన 75 ఏళ్ళ ఆదూర్ గోపాలకృష్ణన్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘బాహుబలి-2’ పై విమర్శలు గుప్పించారు. ఇలాంటి సినిమాలు చూడటానికి తాను 10 రూపాయలు కూడా ఖర్చుపెట్టనని, అసలు ఈ సినిమాలో ఏముందని ఆదూర్ గోపాలకృష్ణన్ ప్రశ్నించారు. 1951లో వచ్చిన ‘పాతాళ భైరవి’కి ఈ సినిమా కాపీ అని, అంతేకాదు, ఇటువంటి చిత్రాల వల్ల సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు.
ఈ సినిమా వల్ల భారత సినీ పరిశ్రమకు ఒరిగిందేమీ లేదని, 10 కోట్లతో మనం 10 సినిమాలు అదే సమయంలో నిర్మించవచ్చని, అలాంటిది కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఇటువంటి “వేస్ట్” సినిమాలు తీస్తున్నారని అన్నారు. ‘బాహుబలి 2: ది కన్క్లూజన్’పై భారతీయ సినీ పరిశ్రమ యావత్తూ ప్రశంసల వర్షం కురిపించడమే కాదు, ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో భారత్లో భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి ఎంతో మంది నిర్మాతలు ముందుకు వస్తున్న తరుణంలో… ఆదూర్ చేసిన విమర్శలు వార్తల్లో నిలుస్తున్నాయి.



