ప్రభుత్వం సకాలంలో సమర్ధమైన చర్యలు తీసుకోకపోతే ప్రతిపక్షానికి ఏవిధంగా అవకాశం లభిస్తుందో అర్థం చేసుకోవడానికి మండలిలో కల్తీ నెయ్యిపై వైసీపీ చేస్తున్న వాదనలు, హడావుడే చక్కటి నిదర్శనం. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోవడం వల్ల కావచ్చు. లేదా ఈ వివాదం ద్వారా రాజకీయ మైలేజ్ లభిస్తుంది కదా అనే ఆశతో కావచ్చు లేదా సిట్ విచారణ నత్తనడకన సాగుతుండటం వలన కావచ్చు.
కారణాలు ఏవైనప్పటికీ కల్తీ నెయ్యి వ్యవహారం కూటమి ప్రభుత్వం చేతికి కూడా అంటుకుంది. ఇలాగే వ్యవహరిస్తుంటే రేపు సిఎం చంద్రబాబు నాయుడే స్వయంగా హెరిటేజ్ సంస్థలో కల్తీ నెయ్యి తయారు చేయించి టిటిడీకి సరఫరా చేస్తున్నారని వైసీపీ ప్రజలను నమ్మించినా ఆశ్చర్యం లేదు.
ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయినా కూడా వైసీపీ ఇంత తేలికగా బయటపడగలిగింది. తిరిగి చంద్రబాబు నాయుడునే నిందిస్తూ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందంటే తప్పు ఎవరిది?
ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని మలుపు తిప్పింది సీబీఐ-సిట్ నివేదిక. దానిని వైసీపీ చాలా తెలివిగా, చురుకుగా అందిపుచ్చుకొని బాణాలు సందిస్తుంటే, కూటమి నేతలు కౌరవ సైన్యంలో అతిరధ మహారధులు నిశ్చేష్టులవుతున్నారు. మండలిలో వైసీపీ దాడిని వారు తిప్పి కొడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్లో నుంచి కాలు బయట పెట్టకుండా రోజుకో కొత్త వ్యూహం రూపొందించి మండలిలో కూటమి నేతలను ముప్పతిప్పలు పెడుతున్నారు కదా?
మొన్న హెరిటేజ్ చీజ్ ప్యాకెట్ చూపి సిఎం చంద్రబాబు నాయుడుని నిలదీసిన వైసీపీ సభ్యులు నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలతో వచ్చి స్వామివారికే అపచారం చేస్తారా? అంటూ నిలదీస్తున్నారు.
స్వామివారి ప్రసాదం, పరకామణి కానుకలు, శాలువాలు, అన్య మత ప్రచారం… ఇలా లెక్కలేనన్ని అపచారాలు చేసింది చాలక నేడు స్వామివారి చిత్రపటాలతో మండలికి వచ్చి రాజకీయాలు కూడా చేస్తున్నారంటే లోపం ఎవరిది?
వైసీపీ ఎప్పటికప్పుడు ఇలా కొత్తకొత్త వ్యూహాలతో వచ్చి దాడి చేస్తుంటే, వారిని ఎదుర్కోవడానికే కూటమి సభ్యులకు సరిపోతోంది తప్ప వారిని దోషులుగా నిరూపించలేకపోతున్నారు. కనుక బాబాయ్ చావుకు సిఎం చంద్రబాబు నాయుడే కారణమని చెప్తున్నవారు కల్తీ నెయ్యికి సిఎం చంద్రబాబు నాయుడు కారణమని చెప్తే ఆశ్చర్యం ఏముంది?




