జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని వైసీపీ చాలా తక్కువగా అంచనావేసి ఇంతకాలం ఆయనతో ‘పెళ్ళాలాట’ ఆడుకొంది. ఆయన తిరిగి జవాబు చెప్పలేకపోతున్నారు గనుక దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అంటూ రకరకాల పేర్లు పెట్టి ఎద్దేవా చేస్తూండేది.
కానీ పవన్ కళ్యాణ్ రెండే రెండు వారాహి యాత్రలతో తనపట్ల వైసీపీకున్న చులకనభావం స్థానంలో భయం పుట్టేలా చేశారు. మొదటి విడతలో కాపుల మద్దతు కూడగట్టేందుకు గట్టిగా ప్రయత్నించడంతో వైసీపీ హడావుడిగా ముద్రగడ పద్మనాభాన్ని రంగంలో దింపింది. కానీ పవన్ కళ్యాణ్ దూకుడుకు అడ్డుకట్టవేయలేకపోయింది.
రెండో విడతలో పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడి, వైసీపీ పునాదులు కదిలిపోయేలా చేశారు. దీంతో జగన్ ప్రభుత్వం పరువు నష్టం దావా వేయడానికి సిద్దపడిందంటే, పవన్ కళ్యాణ్ వైసీపీని ఎంతగా భయపెట్టారో అర్దం చేసుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ‘నన్ను అరెస్ట్ చేసుకోండీ దేనికైనా నేను రెడీ’ అంటూ చెప్పడంతో ఇప్పుడు ముందుకు వెళ్ళాలో లేదో తెలియక వైసీపీ నేతలు తలలు పట్టుకొంటున్నారు.
పైగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ‘మీ గురించి అన్నీ చెప్పానంటూ’ మరో పవన్ కళ్యాణ్ బాంబు పేల్చారు. దీంతో వైసీపీలో అందరూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ పై నుంచి క్రిందవరకు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అదే సిఎం జగన్ వెంకటగిరి సభలో బయటపడింది.
ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏపీలో అందరూ వైసీపీ నేతలను చూసి హడలిపోతుంటే పవన్ కళ్యాణ్ వారిపై ఈస్థాయిలో యుద్ధం చేస్తూ, వారిలో వైసీపీ పట్ల భయం పోగొట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తన నాయకత్వం పట్ల ప్రజలకు, ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి నమ్మకం కలిగేలా కూడా చేస్తున్నారని చెపొచ్చు.
పవన్ కళ్యాణ్ జోరు చూసి పార్టీ నేతలలో, కార్యకర్తలలో కూడా ఉత్సాహం పెరిగింది. తమ అధినేత నేరుగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో మాట్లాడుతారని తెలుసు. కానీ తాజా భేటీలతో పవన్ కళ్యాణ్ వారికి మరింత నమ్మకం కలిగేలాచేశారని చెపొచ్చు.
ఒకవేళ జగన్ ప్రభుత్వం అక్రమకేసులు బనాయించి తమను వేదించినా, తమకు అండగా పవన్ కళ్యాణ్, ఆయన వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందనే నమ్మకం కలిగిస్తే జనసేన కార్యకర్తలు చెలరేగిపోతారని వేరే చెప్పక్కరలేదు. ఇటీవల టీవీ డిబేట్లలో జనసేన నేతలు సిఎం జగన్, ఆయన ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు.
ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా వచ్చీరాగానే జగన్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యి తదుపరి ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చిస్తానని చెప్పారు. అంటే జనసేన అగ్నికి బిజెపి వాయువు తోడవబోతోందన్న మాట. కనుక చిరంజీవి చెప్పిన్నట్లు వైసీపీ ప్రభుత్వానికి ఇన్ ఫ్రంట్ దేరీజే క్రోకడైల్ ఫెస్టివల్ ఉన్నట్లే భావించవచ్చు.



