ఈ మధ్య కాలంలో తెలంగాణ రాజకీయాలను వేడెక్కించిన విమర్శలు ఏమైనా ఉన్నాయా అంటే అవి నాగార్జున కుటుంబం పట్ల మంత్రి కొండా సురేఖ చేసిన విమర్శలే అని నిరభ్యంతరంగా చెప్పవచ్చు. తన ప్రత్యర్థి కేటీఆర్ ను ఇరుకున పెట్టడానికి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తనను ఇరుకున పడేశాయి.
అటు రాజకీయంగా ఇటు సినిమా ఇండస్ట్రీ వర్గాల నుండి సురేఖ పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కోకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో హీరో నాగార్జున కొండా సురేఖ తమ కుటుంబం పట్ల చేసినవ్యాఖ్యలు తమ కుటుంబ పరువుకు భంగం కలిగించాయని, ఆ వ్యాఖ్యలకు సదరు మంత్రి గారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున కోర్ట్ మెట్లెక్కారు.
దీనితో కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం నాగార్జున స్టేట్మెంట్ తో పాటు పలువురు సాక్షుల వాగ్మూలాన్ని కూడా రికార్డు చేసుకుని తదుపరి విచారణను ఈ నెల 10 వ తేదికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
రాజకీయ విమర్శలలో భాగంగా కొండా సురేఖ తన కుమారుడు నాగ చైతన్య, తన మాజీ కోడలు సమంత పై అసంబద్ధమైన ఆరోపణలు చేసిందని, అలాగే అసలు ఈ వివాదాన్ని సంబంధం లేకుండా తన పైన కూడా నిరాధారమైన ఆరోపణలు గుప్పించారంటూ నాగార్జున న్యాయస్థానం ముందు తన వాదన వినిపించారు.
మంత్రి గారి వ్యాఖ్యల మూలంగా సమాజంలో తన కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లనుందనే వాదనతో నాగార్జున కొండా సురేఖ మీద 100 కోట్లకు గాను కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పొన్నం సుధాకర్ వంటి సీనియర్ నాయకులు కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బాధితులకు క్షమాపణలు చెప్పినప్పటికీ సినీ ఇండస్ట్రీ ఈ వివాదాన్ని పెద్దది చేస్తుంది అంటూ ప్రభుత్వం నుండి సినీ ఇండస్ట్రీ కి మెత్తటి హెచ్చరికలు పంపింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 10 న న్యాయస్థానం ఎవరి వాదన వైపు బలమైన తీర్పు వినిపిస్తుందా అంటూ అటు కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటుగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. అలాగే ఇటు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ కేసులో కోర్ట్ ఎవరి వాదనలో వాస్తవాలు ఉన్నాయని పరిగణిస్తుందో అంటూ కేసు విచారణను జాగ్రత్తగా గమనిస్తున్నారు.




