టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన బృందంలో యువతిపై నాలుగేళ్ళుగా ఆత్యాచారం చేస్తున్నట్లు వెలుగు చూసిన ఆరోపణలు టాలీవుడ్లో మళ్ళీ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. నాగబాబు, మంచు మనోజ్ వంటివారు ఆయన అటువంటి తప్పు చేసి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ విచారణని ఎదుర్కొని నిరూపించుకోవాలని సూచించారు.
అయితే ఇండస్ట్రీలో కొందరు జానీ మాస్టర్ని తొక్కేసేందుకే ఈ వ్యవహారాన్ని బయటపెట్టారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఈ ‘లైంగిక వ్యవహారం’ గురించి టాలీవుడ్లో అందరికీ తెలుసని అనుకోవాలేమో?
బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేయగానే జానీ మాస్టర్ గోవాకు పరారీ అవడం కూడా తప్పు చేసిన్నట్లే సూచిస్తోంది. అయితే ఆయన నిజంగా తప్పు చేశారా లేక ఆయనని తోక్కేయడానికి జరిగిన కుట్రలో బలి అవుతున్నారా? అనేది కోర్టు తెలుస్తుంది. కనుక ఎవరికి తోచిన్నట్లు వారు తీర్పులు చెప్పడం సరికాదు.
తెలంగాణ పోలీసులు జానీ మాస్టర్ని గోవాలో అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఆయనకు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు ఆయనని చంచల్గూడా జైలుకి తరలించారు.
అంతకు ముందు అరెస్ట్ చేసి విచారణ జరిపినప్పుడు, జానీ మాస్టర్ బాధితురాలిపై మోజు పడే తన బృందంలో చేర్చుకున్నారని, తొలిసారిగా 2020లో ముంబైలో ఓ స్టార్ హోటల్లో ఆమెపై లైంగిక దాడి చేసిన్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు కోర్టుకి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్ళు.
ఆ తర్వాత ఇటీవల ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేవరకు అంటే గత నాలుగేళ్ళుగా ఆమెపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడని రిపోర్టులో పేర్కొన్నారు.
అయితే ఈ విషయం బయటకు చెపితే సినీ పరిశ్రమలో చోటు లేకుండా చేస్తానని బెరించడమే కాక ఆమె ఎదురు తిరుగుతుండటంతో ఆమెకు అవకాశాలు రాకుండా జానీ మాస్టర్ అడ్డుపడ్డారని రిపోర్టులో పేర్కొన్నారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించారని పేర్కొన్నారు.
జానీ మాస్టర్ నేరం చేసిన్నట్లు అంగీకరించారని పోలీస్ రిపోర్టులో పేర్కొన్నారు కనుక ఇకపై ఈ కేసులో అతను ఏవిదంగా అప్పీలు చేసుకుంటాడో చూడాలి. ఈ కేసులో జానీ మాస్టర్ భార్య కూడా నేరం చేసిన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు కనుక ఆమెకు కూడా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తారా? జానీ మాస్టర్ విషయంలో టాలీవుడ్ ఇప్పుడు ఏవిదంగా స్పందిస్తుంది?అనే ప్రశ్నలకు త్వరలోనే జవాబులు లభిస్తాయి.




