ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్ లో అమరావతికి చట్టబద్దత లభించిన నాడు అమరావతి రైతు కుటుంబాలతో పాటుగా యావత్ రాష్ట్రం మొత్తం ప్రజలు సంబరాలు చేసుకున్నారు. వైసీపీ మూడుముక్కలాట పద్మవ్యూహాన్ని ఛేదించి అమరావతి రాష్ట్ర రాజధానిగా అధికార ముద్ర వేసుకుంది అంటూ రాజధానిగా అమరావతి దక్కిన గుర్తింపు – గౌరవం మీద సర్వత్ర చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా ముందుకొచ్చి వారి ఆనందాన్ని, సంతోషాలకు ‘మావిగన్’ అనే ప్రకటనతో ఆవిరిచేసేశారు. నాడు మూడు రాజధానులు అన్న అదే నోటితో కాదుకాదు విశాఖే ఏపీ ఏకైక రాజధాని అన్న అదే వ్యక్తి నేడు తాజగా మాటమార్చి, మడం తిప్పి మావిగన్ ఏపీ రాజధాని అంటూ మరో కొత్త వివాదాన్ని తెరమీదకు తెచ్చారు.
అమరావతి ఎన్నటికీ రాజధానిగా రూపాంతరం చెందదని, అమరావతి పై ఖర్చు పెట్టె ప్రతి రూపాయి వృధా అంటూ, అమరావతి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని కాదు మోయలేని పెద్ద గుదిబండ అంటూ ఆ ప్రాంతాన్ని నానా విధాలుగా కించపరిచారు వైసీపీ నేతలు, అలాగే అక్కడి ప్రజల పై కూడా అత్యంత నీచమైన వ్యాక్యలు చేసారు.
ఇక గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే అమరావతి గోడు అరణ్య రోధననే చెప్పాలి, ఇక అక్కడి ప్రజల బాధ వర్ణనాతీతమనే ఒప్పుకోవాలి. వీరు రైతులు కాదు పైడ్ ఆర్టిస్టులని ఒకరు కించపరిస్తే ఇది అమరావతి కాదు కమ్మరావతి అంటూ ఇంకొకరు ఇలా ఆ ప్రాంత ప్రజల మనోభావాలతో రాజకీయం చేసారు.
అమరావతి ప్రాంతం పై అక్కడి ప్రాంత ప్రజల పై ఇంత నీచమైన రాజకీయం చేసిన వైసీపీ తాజాగా అక్కడి ప్రాంత రైతులకు జరుగుతున్న అన్యాయం పై ఆరా తీసేందుకు, వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు గాను అమరావతి పర్యటనకు శ్రీకారం చుట్టారు.
దీనితో ఆ ప్రాంతంలోని ప్రజలందరూ గో బ్యాక్ వైసీపీ అంటూ నినాదాలు చేస్తూ వైసీపీ నేతల వాహనాల మీద దాడులు చేసారు. అమరావతికి వ్యతిరేకంగా మావిగన్ అంటూ ప్రకటన చేసిన వైసీపీ కి అమరావతిలో అడుగుపెట్టే అర్హత లేదంటూ, అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి ప్రజల సమస్యల పై స్పదించని వైసీపీ కి ఇక్కడ రైతులతో సంబంధం, ఏంటని.?
ఇక్కడి ప్రజల గురించి రాజకీయం చేసే హక్కు వైసీపీకి లేదంటూ, అమరావతి వినాశాన్ని కోరుకునే వైసీపీ నేతలు అమరావతిలో డుగుపెట్టడానికి వీలులేదంటూ అక్కడి స్థానిక ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. మావిగన్ అభివృద్ధి కోసం అమరావతిలో పరామర్శల అంటూ వైసీపీ పై గొంతెత్తారు.
మరి వారి ఆవేశం ధర్మాగ్రహమే, కానీ వైసీపీ దీన్ని కూడా టీడీపీ కి ముడిపెట్టి, కమ్మ సామాజికవర్గానికి అంటగట్టి మరోకొత్త రాజకీయ వివాదాన్ని సృష్టించి ఆ మంటలో కొన్నాళ్ళు రాజకీయ చలికాసుకుంటుంది.




