జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదిగే కొద్ది ఒదిగే మనస్తత్వం ఉన్నవారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా బాగా తెలిసినవారు. అందుకే రాజకీయాలలో రాణించి తన పార్టీని గెలిపించుకొని అధికారంలోకి తెచ్చుకున్నారు.
తాను ఉప ముఖ్యమంత్రి అయ్యారు. జనసేన నేతలకు కూడా మంత్రిపదవులు దక్కేలా చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం అంతా గతుకుల బాటలో తీవ్ర ఒడిదుడుకులతోనే సాగిందని అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆయన ఎంతో నిబ్బరంగా సమస్యలు సవాళ్ళు ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగి ఈ స్థాయికి చేరుకున్నారు.
ఆయన ప్రసంగాలలో కూడా అదే నిజాయితీ, అదే అమాయకత్వం కనిపిస్తుంటాయి. అదే అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన అభిమానులను!
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపితే తాము గెలవడం అసాధ్యమని జగన్ గుర్తించారు కనుకనే పవన్ కళ్యాణ్ని రెచ్చగొడుతూ, అవహేళన చేస్తూ, కాపు సామాజిక వర్గంలో చీలిక సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి జగన్ భయాలే నిజమయ్యాయి.
సరే జరిగిందేదో జరిగిపోయింది.. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టి బయటకు రప్పించగలిగితే కూటమి కూలిపోతుందని జగన్ పగటి కలలు కంటూనే ఉన్నారు. కానీ మరోసారి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవ్వాలని, ఆయన నేతృత్వంలోనే తాను పనిచేసి మరిన్ని కొత్త విషయాలు నేర్చుకుంటానని నిర్మొహమాటంగా చెప్పడం జగన్, వైసీపీ నేతలు జీర్ణించుకోవడం చాలా కష్టమే.
ఇటీవల పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ మంచి పరిపాలన దక్షత, రాజకీయ, పాలానానుభవం కలిగిన చంద్రబాబు నాయుడు వలన రాష్ట్రానికి, ప్రజలకు మరింత మేలు జరుగుతుందని గట్టిగా నమ్మాను గనుకనే ఓట్లు చీలకుండా ఉండేందుకు టీడీపీతో చేతులు కలిపానని అన్నారు.
ఆ మాటలు పట్టుకొని మాజీ మంత్రి అంబటి రాంబాబు కోడిగుడ్డుకి ఈకలు పీకిన్నట్లు, “పవన్ కళ్యాణ్కి సత్తా లేదని ఒప్పేసుకున్నారు. కనుక ఎప్పటికీ చంద్రబాబు నాయుడుకి విధేయంగా పని చేస్తానని చెప్పుకున్నారు. ఇటువంటి నాయకుడిని నమ్ముకొని ఏం బాగుపడతారు జనసైనికులు?” అంటూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
పవన్ కళ్యాణ్ని నమ్ముకున్నవారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. కానీ అంబటి రాంబాబుతో సహా జగన్ని నమ్ముకున్నవారి పరిస్థితి ఏమిటో అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు.
175కి 175 మనవే అని పార్టీ నేతలను, కార్యకర్తలని జగన్ మభ్యపెట్టి 11 సీట్లు సాధిస్తే, పవన్ కళ్యాణ్ పట్టువిడుపులు ప్రదర్శిస్తూ ముందుకు సాగి 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు.
అంబటి రాంబాబు సత్తెనపల్లిలో రికార్డింగ్ డాన్సులు చేసినా ఎన్నికల్లో గెలవలేకపోయారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం మానేసినా 100 శాతం స్ట్రైక్ రేటుతో జనసేనని గెలపించుకున్నారు. ఇవన్నీ మరిచిపోతే ఎలా?




