ఎన్డీయే నుంచి బయటకు వస్తూ చంద్రబాబు రాసిన లేఖకు అమిత్షా ఈరోజు సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరఫున చేపట్టిన అనేక కార్యక్రమాలను, ఏపీకి ఇచ్చిన ప్రాజెక్టుల వివరాలను 9 పేజీల లేఖలో అమిత్షా ప్రస్తావించారు. పనిలో పనిగా రొటీన్ గా బీజేపీ నాయకులు చేసే రాజకీయ విమర్శలు చేసారు.
అమిత్షా రాసిన లేఖపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. రాష్ట్ర సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన లేకుండా అమిత్షా లేఖ రాశారని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన అన్ని పనులకు సంబంధించి యూసీలు ఎప్పటికప్పుడు కేంద్రానికి అందించినట్లు తెలిపారు. యూసీ సర్టిఫికెట్లకు, ప్రత్యేక హోదాకు సంబంధమేంటని ప్రశ్నించారు.
హోదాతో సహా మిగిలిన 18 హామీలు నెరవేర్చడానికి యూసీ అవసరమా? అని అడిగారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడం ఆవేశపూరిత నిర్ణయం కాదని, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని అనేకసార్లు ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారని లోకేష్ అన్నారు. అలాగే కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేసిన తర్వాత కూడా ఎన్డీయేలో ఉన్నామని, ఇది ఆవేశపూరిత నిర్ణయం ఎలా అవుతుందన్నారు. త్వరలో పూర్తిస్థాయి ఆధారాలతో అమిత్షాకు లేఖ రాస్తామన్నారు.



