వారాంతం కార్యక్రమాల్లో భాగంగా ‘ముఖాముఖీ’ పేరుతో టీవీ9 ప్రతినిధి జాఫర్, ప్రముఖులతో చేసిన ఇంటర్వ్యూలు ఆదివారం నాడు ప్రసారం అవుతూ ఉండడం బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. సంచలన ప్రశ్నలకు నాందిగా సాగే ఈ ఇంటర్వ్యూల పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఈ కార్యక్రమం మాత్రం విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా ఇందులో నెల్లూరు నేత ఆనం వివేకానందరెడ్డి తన భావాలను పంచుకున్నారు. అయితే ఈ సందర్భంగా టీవీ9 యాంకర్ జాఫర్ పై ఆనం తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేసారు.
పెళ్లి కాక ముందు ఆనంకు ఉన్న లవ్ ఎఫైర్ పై ప్రశ్నించగా… “దణ్ణం పెడతానయ్యా నీకు… ఎందుకయ్యా నన్ను సతాయిస్తావ్… నాయబ్బా… ఎందుకు నా తండ్రా… ఇట్లాంటి ప్రశ్నలు వేసి మమ్మల్ని ఇరికించడం తప్ప ఏమైనా ఉందా? పెండ్లికి ముందు ఎప్పుడో సంగతి ఇప్పుడెందుకయ్యా?” అంటూ ఆనం శైలి వ్యాఖ్యలతో నవ్వులు పూయించారు. నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు ఆనం నుండి ఊహించదగినవే అయినప్పటికీ, ఈ కార్యక్రమానికి ఉన్న గుర్తింపు రీత్యా సదరు యాంకర్ పైనే సెటైర్లు వేయడంతో వీక్షకుల చేత కూడా చిరునవ్వులు చిందించారు.
ఆ అమ్మాయి మిమ్మల్ని ఎందుకు ప్రేమించలేదన్న ప్రశ్నకు… “ఎందుకయ్యా దాని విషయాలు ఇప్పుడు. కాపురాల్లో చిచ్చు పెట్టే రకమయ్యా నువ్వు. నువ్వు మర్యాదస్తుడివి కాదయ్యా జాఫర్. నిజంగానే… కాపురంలో, మా కొంపల్లో చిచ్చుపెట్టడానికి నెల్లూరు వచ్చావు. అన్నీ నిజాలే చెబుతానంటే, ఇలాంటి ప్రశ్నలా అడిగేది?” అంటూ చలోక్తులు విసిరారు. తాను మాట్లాడటం మొదలు పెడితే… అమ్మాయి ఎలా ఉందంటావు, పొడుగా, పొట్టా అని అడుగుతావు… ఎందుకయ్యా ఈ ప్రశ్నలు అంటూ సదరు టీవీ యాంకర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఆనం.



