మేడిన్ ఏపీ.. ఎయిర్ టాక్సీ రెడీ!

Made in Andhra Pradesh air taxi developed by Guntur startup Magnawings during test demonstration

ఏరో స్పేస్, రక్షణ రంగాలలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలను అనుమతించిన తర్వాత అనేక స్టార్టప్ కంపెనీలు ఈ రంగంలో ప్రవేశించి సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయి.

తాజాగా గుంటూరుకు చెందిన చావా అభిరామ్ మ్యాగ్నవింగ్స్ అనే స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసి గాలిలో ఎగిరే డ్రోన్‌ వంటి ‘ఎయిర్ టాక్సీ’ తయారు చేశారు.

ADVERTISEMENT

పలుమార్లు దీనిని ప్రయోగాత్మకంగా అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత గురువారం గుంటూరులో దీనిని ప్రదర్శించారు.

విద్యుత్ చార్జింగ్ ద్వారా పనిచేసే ఈ ‘వీ-2, 2.0’ మోడల్ ఎయిర్ టాక్సీలో ఒక మనిషి ప్రయాణించవచ్చు. ఒకసారి చార్జింగ్ చేస్తే ఇది గాలిలో 45 నిమిషాల సేపు లేదా 30 కిమీ దూరం వరకు ప్రయాణించగలదు.

దీనిలో 8 మోటార్లు ఉంటాయి. కనుక గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు వాటిలో రెండు మొరాయించినా మిగిలినవాటితో సురక్షితంగా గమ్యం చేరుకొని భద్రంగా ల్యాండ్ అవవచ్చని తెలిపారు.

ఈ ఎయిర్ టాక్సీలో ఒక రాడార్, ఒక లైడర్, కిందా, పైన, చుట్టూ కెమెరాలు, సెన్సార్లు ఉంటాయి. వీటి సాయంతో పక్షులు, ఎత్తైన భవనాలు, విద్యుత్ టవర్లు, స్థంభాలు, విద్యుత్ వైర్లు, చెట్లు వంటి వాటికి దూరంగా సురక్షితంగా ప్రయాణించవచ్చు.

ఈ ఎయిర్ టాక్సీ సులువుగా వర్టికల్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ చేసేందుకు లైడర్ ఉపయోగపడుతుందని అభిరామ్ చెప్పారు.

అత్యవసర పరిస్థితులలో ఎయిర్ అంబులెన్స్‌గా దీనిని ఉపయోగించవచ్చని లేదా వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మందులు, ఆహార సామాగ్రి దీంతో సరఫరా చేయవచ్చని చెప్పారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాలలో నివసిస్తున్నవారికి అత్యవసర సేవలు అందించేందుకు ఈ ఎయిర్ టాక్సీ బాగా ఉపయోగపడుతుందని అభిరామ్ చెప్పారు.

దీని సేవలు ప్రారంభించేందుకు అవసరమైన ప్రభుత్వ, పౌరవిమానయాన అనుమతులు, దీని పనితీరు, సామర్ధ్యం పరీక్షించే సర్టిఫికేషన్ ప్రక్రియ, సేఫ్టీ క్లియరెన్స్ వంటివాటి కోసం దరఖాస్తు చేసుకున్నామని అభిరామ్ తెలిపారు.

2026 డిసెంబర్‌లోగా ఈ ప్రక్రియ పూర్తయితే 2027 నుంచి ఎయిర్ టాక్సీ సేవలు అందుబాటులో తేగలుగుతామని అభిరామ్ చెప్పారు.

సిఎం చంద్రబాబు నాయుడు కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఇటువంటి ఆవిష్కరణలు ప్రోత్సహిస్తున్నారు. పౌరవిమానయానశాఖ మంత్రిగా మన రామ్మోహన్ నాయుడే ఉన్నారు. కనుక వారిరువురూ చొరవ తీసుకొని వీలైనంత త్వరగా అభిరామ్ చెపుతున్న అనుమతులు, సర్టిఫికేషన్, లైసెన్స్ ప్రక్రియ పూర్తిచేయిస్తే దేశంలో మొట్ట మొదట ఎయిర్ టాక్సీ సర్వీసు ప్రారంభించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories