వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పాటని చివరికి విశాఖ ఒక్కటే రాజధానిగా స్వరపరిచగలిగింది. కానీ కాబోయే రాజధాని అని చెప్పుకొంటున్న విశాఖ నగరంలో కొత్తగా ఒక్క రోడ్డు వేయలేదు…. ఒక్క ఫ్లైఓవర్ నిర్మించలేదు. అంతేకాదు… కాబోయే రాజధాని విశాఖలో ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తోంది.
ఆదివారం రాత్రి 10 గంటలను నుంచి అర్దరాత్రి 12.30 గంటల వరకు నగరంలో పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలలో గ్రామీణ ప్రాంతాలలో రాత్రిపూట విద్యుత్ కోతలు విధిస్తున్నందుకు ప్రజలు అర్దరాత్రి రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు చేస్తున్నారు. విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడిస్తున్నారు. ఇప్పుడు కాబోయే రాజధాని విశాఖ వంతు వచ్చిన్నట్లుంది.
అర్దరాత్రి ప్రజలు విద్యుత్ కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టిన్నట్లు లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాల పరిస్థితి గురించి మాట్లాడకపోవడం విస్మయం కలిగిస్తుంది. వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని వెనకేసుకువస్తూ మీడియా ముందు న్యాయవాదిలా వాదించే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్రంలో విద్యుత్ కోతలు, విద్యుత్ ఛార్జీల వడ్డింపుల గురించి మాత్రం మాట్లాడరు.
ఏపీ, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఈ 9 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రం 24 గంటలు విద్యుత్ సరఫరా చేసే స్థితికి చేరుకోగా, ఏపీలో రాష్ట్ర విభజనకు పూర్వంనాటి పరిస్థితులు నెలకొన్నాయి.
ఏపీలో జీతాల కోసం ఉపాధ్యాయులు, విద్యుత్ కోసం ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే చూసి ఇరుగుపొరుగు రాష్ట్రాలు నవ్వుకొంటున్నాయి. అయినా వైసీపీ ప్రభుత్వానికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు సిగ్గనిపించడం లేదు. ప్రతీ ఇంటికీ మేలు చేశాము… దేశానికే ఏపీ ఆదర్శప్రాయమని నిసిగ్గుగా చెప్పుకొంటున్నారు. ప్రజలను కూడా నమ్మమంటున్నారు.



