ఆరు నెలలు కర్ర సాము నేర్చుకొని చివరికి మూలనున్న ముసలమ్మను కొట్టినట్లుంది ఏపీ ప్రభుత్వం తీరు. మూడేళ్ళపాటు మూడు రాజధానులంటూ హడావుడి చేసిన తరువాత చివరికి అమరావతినే రాజధానిగా అంగీకరించి నిర్మాణాలు చేపట్టక తప్పలేదు.
అదేవిదంగా ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరావు కేసు ముగియడం విశేషం. ఆయన అక్రమాలకు పాల్పడ్డారంటూ 2020లో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన తనకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం కూడా పంథానికి పోయి ఆ న్యాయవివాదంలో పోరాడింది.
దీని కోసం కోట్లాది రూపాయల ప్రజాదనం వృధాగా ఖర్చు చేస్తూ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు రెండేళ్ళపాటు పోరాడినా ఫలితం లేకపోగా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఆయనపై 2020లో విధించిన సస్పెన్షన్ ఎత్తివేసి, 2022, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి విధులలోకి తీసుకోవాలని ఆదేశించింది.
దీంతో ఏపీ ప్రభుత్వం ఆయనను మళ్ళీ విధులలోకి తీసుకోక తప్పలేదు. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసి2022, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి విధులలోకి తీసుకొంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆయనను తిరిగి విధులలోకి తీసుకొన్నప్పటికీ ఏ పదవీ బాధ్యతలు అప్పగించలేదు! తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని మాత్రమే ఉత్తర్వులలో పేర్కొంది. ఆ తదుపరి ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయో తెలీదు కనుక అంతవరకు ఆయన ఎదురుచూడవలసిందే. ఒకవేళ ఉత్తర్వులు ఇచ్చినా ఆయనకు ఇదివరకులాగ ప్రభుత్వం కీలక పదవి ఇస్తుందని ఆశించలేరు.
ప్రభుత్వంలో భాగమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వమే కక్ష గడితే ఇక వారు సమర్ధంగా, నిష్పక్షపాతంగా ఎలా పనిచేయగలరు?ప్రభుత్వ నిర్ణయాలను అమలుచేస్తునందుకు వారు కోర్టుల చుట్టూ తిరుగుతూ, జరిమానాలు చెల్లిస్తూ, జైళ్ళకు వెళ్ళవలసి వస్తుండటాన్ని ఏమనుకోవాలి?ఇటువంటి అవాంఛనీయ పరిణామాలకు ఎవరు బాధ్యత వహించాలి?



