మూడు రాజధానులతోనే అభివృద్ధి సాధ్యమని వాదిస్తున్న వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ళు గడిచిపోయినా అటు ఇటుక తీసి ఇటు పెట్టలేదు కానీ విశాఖ రాజధాని అంటూ విశాఖ గర్జన సభతో హడావుడి చేసింది. న్యాయరాజధాని అంటూ కర్నూలులో హడావుడి చేసింది. తర్వాత అందరూ చల్లబడిపోయారు.
అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసినట్లయితే చంద్రబాబు నాయుడు, టిడిపికి, కమ్మసామాజిక వర్గానికి లబ్ది కలుగుతుందనే ఆలోచనతోనే సిఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు ఆయన, మంత్రులు, ఎమ్మెల్యేల మాటలతోనే స్పష్టం అవుతోంది. అమరావతి వద్దనుకొన్నారు సరే! కానీ మూడు రాజధానులపైనైనా వైసీపీకి చిత్తశుద్ధి ఉందా?అంటే అనుమానమే.
ఎందుకంటే, రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా జస్టిస్ జోసఫ్ ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు ఎక్కడ ఉండాలనుకొంటోంది?” అని ప్రశ్నించినప్పుడు, ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ “అమరావతిలోనే…” అని సమాధానం చెప్పారు.
కానీ ప్రభుత్వం, ముఖ్యంగా… రాయలసీమ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తామని ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా రాయలసీమకి దక్కిన ఈ అవకాశాన్ని టిడిపి, జనసేనలు చెడగొట్టాలని చూస్తున్నాయంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అక్టోబర్ 29న తిరుపతి పట్టణంలో ‘రాయలసీమ ఆత్మగౌరవ మహాప్రదర్శన’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించడమే ఇందుకు నిదర్శనం.
కర్నూలులో హైకోర్టుని ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు ప్రజలని రెచ్చగొట్టి ధర్నాలు, ర్యాలీలు చేయిస్తుంటే, అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకి చెపుతోంది. అంటే ప్రభుత్వం సుప్రీంకోర్టుని తప్పుదోవ పట్టిస్తోందా లేక న్యాయరాజధాని పేరుతో రాయలసీమ ప్రజలను మభ్యపెట్టి రెచ్చగొడుతోందా?అనే సందేహం కలుగుతుంది.



