ఇదివరకు ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ప్రజలు రెండు రాష్ట్రాలను పోల్చి చూసుకునేవారు.
అభివృద్ధి విషయంలో తెలంగాణ దూసుకుపోతుంటే, జగన్ పాలనలో అభివృద్ధి అనే పదం కూడా వినిపించేది కాదు. జగన్ ప్రభుత్వం సంక్షేమ పధకాలకి, రాజకీయ కక్ష సాధింపులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో పూర్తిగా వెనుకబడిపోయింది . ఈ కధ అందరికీ తెలిసిందే కనుక మరింత చెప్పుకోనవసరం లేదు.
ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కనుక ప్రజలు మళ్ళీ రెండు రాష్ట్రాలను పోల్చి చూసుకుంటున్నారు. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం నిర్మాణ పనులని మళ్ళీ మొదలుపెట్టిస్తున్నారు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా మొదట చాలా సానుకూల వాతావరణం సృష్టించి ప్రజలకు నమ్మకం కలిగించారు. తెలంగాణకి పరిశ్రమలు, పెట్టుబడుల కోసం ప్రయత్నించారు. ప్రభుత్వానికి భారం అవుతునప్పటికీ కొన్ని హామీలను అమలుచేసి ప్రజల మెప్పు పొందారు. సిఎం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిలా ఎన్నికల హామీల అమలుకి తొందరపడటం లేదు. అలాగని ప్రజలు వాటి కోసం ఒత్తిడి చేయడం లేదు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే లూలూ గ్రూప్తో చర్చలు జరిపారు. మరికొన్ని సంస్థలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. కనుక ఈ ఏడాది ముగిసేలోగానే ఏపీలో ఏ మేరకు పెట్టుబడులు వస్తాయనేది తేలిపోతుంది.
విజయవాడ వరదలతో సిఎం చంద్రబాబు నాయుడు, టిడిపి కూటమి ప్రభుత్వం ప్రతిష్ట మరింత పెరగగా, ఖమ్మం వరదలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ట మసకబారింది.
హైడ్రా కూల్చివేతలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ట మసకబారుతోంది. కేవలం హైదరాబాద్లో మాత్రమే ఇళ్ళు కూల్చివేస్తున్నప్పటికీ ఆ ప్రభావం యావత్ తెలంగాణ రాష్ట్రం మీద పడుతోంది.
ఇది బిఆర్ఎస్ పార్టీకి బలమైన అస్త్రంగా మారింది. తమది ఫ్లైఓవర్లు, ప్రాజెక్టులు కట్టిన ప్రభుత్వంకాగా రేవంత్ రెడ్డిది కూల్చివేతల ప్రభుత్వమని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేజెతులా రాష్ట్రంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టించుకున్నారని చెప్పవచ్చు.
తెలంగాణలో ప్రజలు హైడ్రా కారణంగా క్రమంగా ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీకి దగ్గరవుతుంటే, ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం మొదలైనప్పటి నుంచి ప్రజలు ప్రతిపక్ష వైసీపికి మరింత దూరం అవుతున్నారు. ఇదే అంశంతో సిఎం చంద్రబాబు నాయుడు వైసీపి, దాని అధినేత జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీయగలిగారు కూడా. గత 7-8 నెలలుగా ఫామ్హౌస్లో నుంచి బయటకు రావడానికి జంకిన కేసీఆర్, నేడో రేపో బయటకు వచ్చి సిఎం రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేస్తూ రాజకీయంగా పైచేయి సాధించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కానీ ఇక్కడ ఏపీలో కల్తీ నెయ్యి వివాదంలో జగన్ నిలువునా కూరుకుపోతున్నారు. ఇక కనుక ఇప్పుడు ఏవిదంగా చూసినా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మెరుగుగా ఉన్నట్లు కనిపిస్తోంది.




