వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్కు నగ్న వీడియో కాల్ వ్యవహారంలో అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఇప్పటికే క్లీన్ చిట్ ఇవ్వగా నేడు మరో ఉన్నతాధికారి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆయనే ఏపీ సీఐడీ పోలీస్ చీఫ్ సునీల్ కుమార్.
ఈరోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఓ పురుషుడు, మహిళ మాట్లాడుకొన్నట్లు చెప్పబడుతున్న వీడియో కాల్ను వేరొకరు మరో ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అయ్యింది. దీనిపై రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీ అమెరికాలోని ఓ ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్ష చేయించి అది ఒరిజినల్ వీడియో అని చెపుతూ సదరు సంస్థ అధికారి జిమ్ క్లిఫోర్డ్ ఇచ్చినట్లు చెపుతున్న ఓ లేఖను సోషల్ మీడియాలో పెట్టింది.
ప్రభుత్వం ఆదేశం మేరకు మేము ఆ సంస్థకు లేఖ వ్రాయగా అసలు జిమ్ క్లిఫోర్డ్ తాను ఎవరికీ అటువంటి లేఖ ఇవ్వలేదని, ఎవరో ఉద్దేశ్యపూర్వకంగానే తన పేరిట బోగస్ లేఖను సృష్టించి ఉండవచ్చని ఈ మెయిల్ ద్వారా మాకు సమాధానం ఇచ్చారు. ఒరిజినల్ వీడియో క్లిప్పింగ్ ఉంటేనే పరీక్షించి అది అసలైనదో కాదో చెప్పగలమని లేకుంటే సాధ్యం కాదని వారు మాకు తెలియజేశారు.
ఎస్పీ ఫకీరప్ప కూడా ఇదే చెప్పారు. కనుక విదేశీ సంస్థ నివేదిక ఇచ్చిందంటూ ఆ నకిలీ లేఖతో సమాజంలో వ్యక్తులను, ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలుజేయాలని ప్రయత్నించేవారిపై ఐటి చట్టంలో సెక్షన్: 67 ప్రకారం కేసులు నమోదు చేస్తాము,” అని సునీల్ కుమార్ హెచ్చరించారు.
గోరంట్ల మాధవ్ షోకి సంబందించి ఒరిజినల్ వీడియో దొరకలేదు కనుక ఫోరెన్సిక్ పరీక్షలు జరపలేరు. ఫోరెన్సిక్ నివేదిక రాదు కనుక గోరంట్ల మాధవ్పై వైసీపీ ఎటువంటి చర్యలు తీసుకోదు. అమెరికా సంస్థ ఇచ్చిన నివేదిక కూడా నకిలీదని తేల్చేశారు. కనుక ఈ కధ ఇక్కడితో సమాప్తం అని భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకా ఉందని భావిస్తే వారిపై ఐటి చట్టం 67 ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఏపీ సీఐడీ పోలీస్ చీఫ్ సునీల్ కుమార్ హెచ్చరిస్తున్నారు. కనుక ఇప్పుడు బంతి టిడిపి కోర్టులో పడినట్లే! టిడిపి ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి.



