సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చెప్పుకోవలసిన అంశం పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం.
రాబోయే 5 ఏళ్ళలో రూ.30 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించి వాటి ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగాలు లభించేలా చేయాలని నిర్ణయించారు.
అయితే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వామైనా ఇటువంటి ప్రతిపాదనలు, ప్రకటనలు చేయడం సర్వసాధారణమే. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనలని ఏవిదంగా నమ్మగలము? అనే సందేహం కలుగుతుంది. అందుకు ఇవే సమాధానాలు.
1. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీఐఐసీ మాత్రమే రాష్ట్రంలో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసి పరిశ్రమలకు కేటాయించేది. లంచగొండితనం, ఆ కారణంగా అనుమతులు లభించకపోవడం, పనులు ఆలస్యం
వంటివి పరిశ్రమలు స్థాపించాలనుకునేవారికి స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్నాయి. కనుక ఇకపై ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 175 పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
2. ప్రస్తుతం రాష్ట్రంలో 20 పారిశ్రామిక క్లస్టర్లున్నాయి. వీటికి అదనంగా మరో 29 క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి ఏర్పాటు కోసం 1.32 లక్షల ఎకరాలు ప్రభుత్వం కేటాయిస్తుంది.
3. ఈ పారిశ్రామికవాడల లేఅవుట్ అప్రూవల్ ఛార్జీలు, నీళ్ళు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిర్ణయించారు.
4. రాష్ట్రంలో అనేక నౌకాశ్రయాలు (పోర్టులు) ఉన్నాయి. వాటికి అనుబంధంగా పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసి వాటిలో ఎగుమతులకు వీలున్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
5. ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యం, ప్రోత్సాహకాలు.
6. ఉత్తరాంధ్రా, కోస్తా, రాయలసీమ జిల్లాలలో సహజ, మానవ వనరులు ఆధారంగా ప్రత్యేక పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేసి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని విదాల సహకరిస్తుంది. ఉదాహరణకు ఇప్పటికే ఆటోమోబైల్
పరిశ్రమలున్న రాయలసీమలో వాటికి సంబందించిన చిన్న, మధ్య, పెద్ద పరిశ్రమల ఏర్పాటుని ప్రోత్సహిస్తుంది. ఉత్తరాంధ్రా, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలలో పంటలు, ఎరువులు, ఆహార ఉత్పత్తులు, ఆక్వా, ఫుడ్ ప్రొసెసింగ్
తదితర పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
7. ఆయా ప్రాంతాలలో ఏర్పాటు కాబోయే వివిద పరిశ్రమలలో ఉద్యోగాలకు తగిన నైపుణ్యం పెంపొందించే కోర్సులను ఐటిఐలలో ప్రవేశపెట్టి విద్యార్దులకు వాటిలో ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు.
8. పరిశ్రమల ఏర్పాటుకి అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేసేందుకు ఉన్న సింగిల్ విండో సిస్టమ్ని మరింత మెరుగుపరిచి సరళీకరించబోతోంది.
9. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నప్పుడు, ఆ తర్వాత పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందజేసేందుకు ప్రతీ జోన్లో ఓ సీనియర్ అధికారి ఉంటారు.
10. పరిశ్రమలకు పెట్టుబడి, ఉద్యోగాల కల్పన ఆధారంగా భారీగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ముందుగా వచ్చిన వారికి అదనంగా మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.




