గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి తిరుమలని ఎంత అపవిత్రం చేశారో అందరూ చూశారు. టిటిడిని ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసి అస్మదీయులతో నింపేశారు. వారి ద్వారా తిరుమలకు వచ్చే జాతీయ స్థాయి ప్రముఖులను ప్రసన్నం చేసుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు.
నాసి రకం మద్యం అమ్మి ప్రజలు ప్రాణాలతో చలగాటం ఆడిన జగన్ ప్రభుత్వం, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడి నాసి రకంగా మార్చేసి దానిని కూడా వ్యాపార సరుకుగా మార్చేసి తిరుమల ప్రతిష్టని, పవిత్రతని దెబ్బ తీసింది.
తాజాగా దర్శనం టికెట్స్ ‘గోల్మాల్’ వ్యవహారంలో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా ఇటువంటి కధలు ఎనెన్ని వినాల్సి ఉంటుందో ఆ దేవదేవుడికే తెలియాలి.
అయితే చేయకూడని తప్పులు, అపచారాలు అన్నీ చేసి, ఈ భాగోతం బయటపడిన తర్వాత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారితో ఎవరు ఆటలాడుకున్నా భారీ మూల్యం చెల్లించక తప్పదని జగన్మోహన్ రెడ్డి అని సిఎం చంద్రబాబు నాయుడుని బెదిరిస్తుండటం చాలా హాస్యస్పదంగా ఉంది.
అదే… తాను తిరుమల శ్రీవారితో ఆటలాడినందుకే ఎన్నికలలో ఓడిపోయీ అధికారం కోల్పోయానని జగన్ చెప్పుకుని ఉంటే చాలా సహేతుకంగా ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు దేవుడితో ఆటలాడుతున్నారు… మూల్యం చెల్లించక తప్పదని అన్య మతస్థుడైన జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వరస్వామిని చంద్రబాబు నాయుడు తమ ఇలవేల్పుగా భావిస్తున్నారు కనుకనే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరుగుతోందని గుర్తించగానే దర్యాప్తు జరిపించారు. అప్పుడే ఈ వ్యవహారం బయటపడింది. తిరుమల శ్రీవారిపట్ల జరుగుతున్న అపచారాన్ని గుర్తించి అడ్డుకోవడం అంటే ఓ భక్తుడిగా స్వామివారి పట్ల తన కర్తవ్యం నిర్వహించినట్లే కదా?
జగన్ చేసిన ఈ తప్పు గురించి సిఎం చంద్రబాబు నాయుడు ప్రజలు, మీడియాకి చెప్పింది చాలా తక్కువే. అయినా కూడా యావత్ దేశ ప్రజలకు దీని గురించి ఇంతగా తెలిసి, జగన్ని తప్పు పడుతున్నారంటే ఇది స్వామివారి మహత్యమే అని అనుకోవలసి ఉంటుంది.
కానీ నేటికీ జగన్కు తిరుమల శ్రీవారి విషయంలో జ్ఞానోదయం కాలేదు. కనుక జగన్ ఇంకా మూల్యం చెల్లించుకోక తప్పదు. అది ఏవిదంగా అనేది రాబోయే రోజుల్లో అందరూ చూస్తారు.




