సముద్రతీరంలో షిప్ యార్డులు, నావల్ దర్శకత్వం యార్డులు, సరుకు రవాణా పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వాటికి సమీపంలో ఆక్వా కంపెనీలు ఉండటం సర్వసాధారణమే.
కానీ ఇప్పుడు వాటితో పాటు పారిశ్రామికవాడలు, లాజిస్టిక్ హబ్లు కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీటి వలన ఆ ప్రాంతాలలో భారీగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి.
తాజాగా నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె వద్ద అటానమస్ మారి టైమ్ షిప్ యార్డు ఏర్పాటు కాబోతోంది. దీనిని ముంబయి కేంద్రంగా పనిచేసే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించబోతోంది.
దీంతో పాటు అక్కడ నావికా దళానికి అవసరమైన ఇంటలిజెన్స్ మారి టైమ్ సిస్టమ్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్స్లో వినియోగించి సాంకేతిక పరికరాలు తయారు చేసేందుకు అక్కడే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ (పరిశ్రమ) ఏర్పాటు కాబోతోంది.
దీనికి మంత్రి నారా లోకేష్ నిన్న శంకుస్థాపన చేశారు. సాధారణ ఉత్పత్తులు, యంత్ర పరికరాలు తయారుచేసే పరిశ్రమలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. కానీ నావికాదళానికి అవసరమైన రక్షణ, సాంకేతిక పరికరాలు తయారుచేసే ప్రైవేట్ కంపెనీ ఏపీలో ఇదే మొదటిది.
ఈ కంపెనీ మొదటి దశలో రూ.45 కోట్లు పెట్టుబడితో ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తుంది. మిగిలిన కంపెనీలటో పోలిస్తే దీని పెట్టుబడి తక్కువగా ఉన్నప్పటికీ తొలిదశలోనే 750 మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది.
జువ్వలదిన్నె వద్ద అటానమస్ మారి టైమ్ షిప్ యార్డు ఏర్పాటు కూడా సిద్దమైతే సుమారు 25 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
కర్నూలులో ఓర్వకల్ వద్ద డ్రోన్ సిటీ ఏర్పాటు, ఇప్పుడీ అటానమస్ మారి టైమ్ షిప్ యార్డు ఏర్పాటు వంటివి, ఏపీని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఉన్నతస్థాయిలో నిలబెట్టేవే!




