ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతూ ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని తెలిపారు.
కూటమిలో మూడు పార్టీలునందున వాటి బలాలు, బలహీనతలు, సీట్ల సర్దుబాట్లు, స్థానిక నాయకుల సమర్దత, వైఫల్యాలు, ప్రజాధరణ, వ్యతిరేకత ఇలా అనేక లెక్కలు సరి చూసుకోవాల్సి ఉంటుంది.
వైసీపీ సింగిల్ సింహం! అన్ని నిర్ణయాలు తాడేపల్లి ప్యాలస్లోనే జరిగిపోతాయి. కనుక దానికి ఇన్ని లెక్కలు, ఇబ్బందులు ఉండవు. పైగా సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతేనే వైసీపీకి ‘ఫరక్’ పడనప్పుడు ఈ ఎన్నికల్లో ఓడినా ‘ఫరక్’ పడదు.
కానీ ఈ ఎన్నికలను సద్వినియోగం చేసుకొని ఎక్కువ స్థానాలు గెలుచుకోగలిగితే ‘కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందనే’ తన వాదన నిరూపించుకున్నట్లవుతుంది. కనుక వీటి కోసం కాస్త గట్టిగానే ప్రయత్నించవచ్చు.
సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీయే గెలుచుకుంటుంది. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడమే ఇందుకు తాజా ఉదాహరణ.
కానీ ఈ ఎన్నికలలో వైసీపీ కాస్త గట్టిగానే ప్రయత్నిస్తుంది. కూటమి పార్టీల కంటే చాలా చురుగ్గా, తెలివిగా రకరకాల వ్యూహాలు అమలు చేయగలదని ఇప్పటికే నిరూపించుకుంది. కనుక ఈ ఎన్నికలు కూటమి ప్రభుత్వానికే అగ్నిపరీక్షగా మారవచ్చు.
కానీ 2029 ఎన్నికల్లో కూడా గెలిచి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని కూటమి ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్నందున, రాగలదో లేదో తెలుసుకోవడానికి ఈ ఎన్నికలు చాలా ఉపకరిస్తాయి.
ఒకవేళ ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోతే కూటమి ప్రభుత్వంలో తప్పులు, లోపాలు సరిదిద్దుకునేందుకు కావాల్సినంత సమయం లభిస్తుంది. అప్పుడు 2029 ఎన్నికలను మరింత నమ్మకంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని విజయం సాధించవచ్చు.




