మన ఆలోచనలు, విధానాలు, నిర్ణయాలు తప్పని మనం సకాలంలో గుర్తించలేకపోవచ్చు. కానీ వాటి దుష్ప్రభావాలను కళ్ళారా చూసినప్పుడు తప్పకుండా తప్పటడుగులు వేశామని అర్దమవుతుంది.
అయితే జగన్మోహన్ రెడ్డికి మాత్రం నేటికీ ఆ జ్ఞానోదయం కలుగకపోగా, తాను ఎంచుకొన్న సంక్షేమ మార్గమే సరైనదని గట్టిగా నమ్ముతుండటం విశేషం.
తాడేపల్లి ప్యాలస్లో నేడు పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో జగన్ సమావేశమైనప్పుడు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ ఏటా సంక్షేమ క్యాలండర్ ప్రకటించి, దాని ప్రకారమే నిధులు విడుదల చేసే వాళ్ళం.
కానీ నాలుగు నెలలవుతున్నా చంద్రబాబు నాయుడు సంక్షేమ పధకాలను అమలు చేయలేకపోతున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే సంక్షేమ పధకాలకు నిధులు కేటాయించిన్నట్లు చూపాల్సివస్తుంది కనుక బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో ఇసుక లభించడం లేదు. మద్యం అమ్మకాలతో మరింత ఆదాయం సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తోంది.
ప్రజలు మన పాలనకు, చంద్రబాబు పాలనకి మద్య తేడాని చూస్తున్నారు. మనం ప్రజా సంక్షేమమే ప్రధానమనుకుంటే, చంద్రబాబు అందరినీ మోసగిస్తూ, అబద్దాలు చెపుతూ పాలన సాగిస్తున్నారు.
కనుక మనం ప్రజల పక్షాన్న నిలబడి ప్రభుత్వంతో పోరాడుతూనే ఉండాలి. ప్రజల కష్ట సమయంలో అండగా నిలబడితే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాము,” అంటూ జగన్ హితబోధ చేశారు.
జగన్ ధోరణి, విధానాలు ఏవీ సరికావనే ప్రజలు వైసీపిని తిరస్కరించారనే సంగతి మరిచిపోయి, టిడిపి కూటమి ప్రభుత్వం సంక్షేమ పధకాలను అమలు చేయలేకపోతోందని ఆరోపిస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు 175కి 175 సీట్లు మనమే గెలుచుకుంటామని పార్టీలో అందరినీ జగన్ మభ్యపెట్టారు. అధికారం కోల్పోయినా మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని జగన్ పగటి కలలు కంటూ, మళ్ళీ పార్టీ నేతలను కూడా మభ్యపెడుతున్నారు.
జగన్ తాజా ప్రసంగాన్ని బట్టి రాష్ట్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ఆయన ఇంకా గ్రహించలేదని స్పష్టమవుతోంది. ఒకవేళ గ్రహించినా ఒప్పుకొని చెప్పుకోవడానికి అహం అడ్డొస్తోందేమో?
ప్రజలు జాబ్ క్యాలండర్ కోరుకొంటున్నారు కానీ సంక్షేమ క్యాలండర్ కాదని జగన్ గ్రహించలేదు. ఈవిదంగా తన ఇగో కోసం సొంత పార్టీని, నేతల భవిష్యత్ని కూడా పణంగా పెట్టడానికి వెనకాడని జగన్ వంటి ప్రతిపక్ష నేత ఉన్నంత కాలం టిడిపి కూటమికి ఢోకా ఉండదు.






