బండి కాదు… బుల్డోజరే!

Bandi Sanjay speaking at Jubilee Hills by-election rally in Telangana

ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలను కంటి సైగతో శాశించిన కేసీఆర్‌కి ముచ్చెమటలు పట్టించిన రాజకీయ నాయకుడు ఎవరంటే బీజేపి ఎంపీ బండి సంజయ్‌ పేరు చెప్పుకునేవారు.

కానీ బండి తన స్థాయికి సరిపోరని భావించిన కేసీఆర్‌ నేరుగా ప్రధాని మోడీతో పెట్టుకొని ఎదురుదెబ్బ తిన్నారు. బీఆర్ఎస్‌ పార్టీని రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీయే ఓడించినప్పటికీ, కేసీఆర్‌ చేత అలా తప్పటడుగు వేయించి, ఆయన ఓటమికి కారణం అయ్యింది మాత్రం బండి సంజయ్‌ అని చెప్పక తప్పదు.

ADVERTISEMENT

కానీ బ్రహ్మాస్త్రం వంటి బండి సంజయ్‌ విలువ తెలుసుకోలేకనో లేదా కేసీఆర్‌ పట్ల సానుభూతితోనే చివరి నిమిషంలో బండి సంజయ్‌ని తెలంగాణ బీజేపి అధ్యక్ష పదవి నుంచి తప్పించేసి, బీజేపి అధిష్టానం చారిత్రిక తప్పిదం చేసిందని రాజకీయ విశ్లేషకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. లేకుంటే నేడు తెలంగాణలో బీజేపియే అధికారంలో ఉండేదని అభిప్రాయపడుతుంటారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్‌ ప్రవేశించనంత వరకు ఒక లెక్క… ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లు హటాత్తుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో బీజేపిని పట్టించుకునే నాధుడే లేడు. కానీ బండి లేటుగా వచ్చినా ఎప్పుడూ లేటెస్టుగానే వస్తారు.

వస్తూనే “చనిపోయిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆస్తుల విషయంలో వారి కుటుంబంలో వివాదాలు నడుస్తున్నాయని, వాటిలో కేటీఆర్‌ ప్రమేయం ఉందంటూ” బాంబు పేల్చారు. గోపీనాథ్ మృతి, ఆస్తుల విషయంలో అయన తల్లి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని మరో బాంబు పేల్చారు.

కనుక గోపీనాద్ మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి కేటీఆర్‌ని అరెస్ట్‌ చేసి విచారణ జరిపించాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

కేటీఆర్‌ జనతా గ్యారేజ్ సినిమా డైలాగులు కొడుతూ ప్రజలను ఆకట్టుకోవాలని తిప్పలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్ళుగా ఫామ్‌హౌసులో పడుకున్న కేసీఆర్‌, మరో మూడేళ్ళ తర్వాత వచ్చి ముఖ్యమంత్రి అయిపోతామని ఎలా అనుకుంటున్నారని బండి సంజయ్‌ ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత తన అన్న, బావతో జాగ్రత్తగా ఉండమని తండ్రి కేసీఆర్‌ని హెచ్చరించారంటే అర్ధమేమిటని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నియోజకవర్గంలో ముస్లింల ఓట్ల కోసమే టోపీలు పెట్టుకొని తిరుగుతున్నారని, ఉత్తుత్తి నమాజులు చేస్తున్నారని బండి సంజయ్‌ ఆక్షేపించారు. కానీ ఇది ఇస్లాం మతాన్ని అవమానించడమేనని బండి సంజయ్‌ అన్నారు. “నేను ముస్లింల ఓట్ల కోసం ఇలాంటి వేషాలు వేయను. ఇతర మతాలను ఈవిదంగా అవమానించను,” అన్నారు.

నియోజకవర్గంలో 30 శాతం ముస్లింల ఓట్ల కోసమే కాంగ్రెస్‌ పార్టీ మజ్లీస్‌తో చేతులు కలిపింది. దానికి 70 శాతం హిందువుల ఓట్లు అవసరం లేదని స్పష్టమైంది.

కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు రెండూ మజ్లీస్ చంకలో పిల్లులే. కనుక వాటిలో దేనికి ఓట్లు వేసినా మజ్లీస్ పార్టీకి వేసినట్లే అవుతుంది. కనుక హిందువులందరూ బీజేపికి ఓట్లు వేసి గెలిపించాలని బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు.

బీఆర్ఎస్‌ పార్టీ సానుభూతి కార్డు వేస్తే, కాంగ్రెస్‌ పార్టీ ముస్లిం కార్డు వేసి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో గెలవాలనుకున్నాయి.

కానీ బండి సంజయ్‌ చాలా తెలివిగా ఆ రెండింటికీ ముడిపెట్టి, హిందూ ఓటర్లందరినీ బీజేపి వైపు బుల్‌డోజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో బీజేపి గెలవకపోవచ్చు. కానీ బండి సంజయ్‌ ఎన్నికల ప్రచారం ఇలాగే కొనసాగితే కాంగ్రెస్‌, బీజేపిల ఓట్లను నిలువునా చీల్చేయగల సమర్దులే!

ADVERTISEMENT
Latest Stories