ఓ సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్ళించాలంటే మరో సమస్య లేదా వివాదం సృష్టించాలనే ఫార్ములాని మన రాజకీయ పార్టీలు చాలా కాలంగా ఫాలో అవుతున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రస్తుతం ఇదే ఫార్ములాతో ప్రజల దృష్టి మళ్ళించేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.
అంతర్యుద్ధాలు, కవిత చేస్తున్న అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టి మళ్ళించేందుకే కృష్ణ జలాలు, రాయలసీమ ఎత్తిపోతల పధకం గురించి కొట్లాడుకుంటున్నట్లు నటిస్తున్నాయని బండి సంజయ్ ఆక్షేపించారు.
కేసీఆర్ హయంలో జరిగిన అవినీతి, అక్రమాలను ఆయన కూతురు కల్వకుంట్ల కవిత బయటపెడుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిపై ఎందుకు స్పందించడం లేదు?ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?సిఎం రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీలని కేటీఆర్ హౌలాగాళ్ళు… ఇద్దరినీ ఉరి తీయాలన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు?కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని ప్రశ్నించారు.
“కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్పై ఇన్ని తీవ్ర ఆరోపణలు చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ ఎందుకు స్పందించడం లేదు?ఆమె ఆరోపణలను ఎందుకు ఖండించడం లేదు? అంటే అవినీతికి పాల్పడ్డామని వారు ముగ్గురూ అంగీకరిస్తున్నారా?” అని బండి సంజయ్ ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహనా ఉందా లేదా? అనేది పక్కన పెడితే రెండు పార్టీలు తలోరకం సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కనుక నదీ జలాలు, ప్రాజెక్టుల పేరుతో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని నిందిస్తేస్తే తెలంగాణ ప్రజల దృష్టిని సులువుగా మళ్ళించవచ్చని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నమ్మకం. బండి సంజయ్ ఇదే చెప్తున్నారు.






