తిరుమల శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్తులు తమకు స్వామివారిపై నమ్మకం, భక్తి ఉన్నాయని పేర్కొంటూ రిజిస్టర్లో సంతకం చేయాలి. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంతటివారు కూడా ఆ సంప్రదాయాన్ని గౌరవించారు.
కానీ నేడు తిరుమలకి రాబోతున్న వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్పై సంతకం చేయరని భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు.
టీటీడీ మాజీ ఛైర్మన్గా పనిచేసిన ఆయన ‘అసలు ఎందుకు చేయాలి? చేయకుండానే స్వామివారిని దర్శించుకుంటాము. మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారో మేమూ చూస్తాం,” అని సవాలు విసిరారు.
డిక్లరేషన్ మీద సంతకం చేయాలని జగన్కి నచ్చచెప్పే బదులు ఎందుకు చేయాలని అడుగుతున్న ఇటువంటి వ్యక్తా ఇంతకాలం టీటీడీ ఛైర్మన్గా పనిచేశారు?అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ డిక్లరేషన్ విధానం ఈనాటిది కాదు ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇంతగా ఎప్పుడూ హైలైట్ అవలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దానిని పట్టించుకోలేదు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నందున ఎవరూ ఆయనని ప్రశ్నించలేకపోయారు.
కానీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ ధోరణి మారకపోగా, తిరుమల సాంప్రదాయాలను మేము గౌరవించమని తెగేసి భూమన చెపుతుండటంతో హిందూ సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి.
ఈ విపరీత ధోరణి కారణంగానే ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయంగా మారిందని చెప్పవచ్చు. అయినా నుదుటన నామాలు పెట్టుకోవడానికి, స్వామివారిని దర్శించుకోవడానికి లేని అభ్యంతరం డిక్లరేషన్పై సంతకం పెట్టడానికి దేనికి?అంటే ఈ పేరుతో పరమ పవిత్రమైన తిరుమలలో ఘర్షణ వాతావరణం సృష్టించాలనే దురుద్దేశ్యంతోనే అని భావించాల్సి ఉంటుంది.
తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడమే క్షమించారని తప్పిదం అనుకుంటే, ఇప్పుడు కొండపైకి వైసీపి సైన్యాన్ని వెంటపెట్టుకొని దండయాత్ర చేయాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు.
ఇప్పటికే జనసేన, బీజేపీ, హిందూ ధార్మిక సంఘాలకు చెందిన వేలాదిమంది తిరుపతి పట్టణంలో ఎక్కడికక్కడ జగన్ రాకని నిరసిస్తూ ధర్నాలు చేస్తున్నారు. తిరుమల కొండపైకి జగన్, వైసీపి నేతలని అడుగు పెట్టనీయబోమని హెచ్చరిస్తున్నారు.
మరోపక్క జగన్ పర్యటన ని విజయవంతం చేసేందుకు అంటూ వైసీపి శ్రేణులు కూడా తిరుపతి పట్టణంలో సిద్దంగా ఉన్నారు.
కనుక తిరుపతిలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తిరుపతి టూ టౌన్ పోలీసులు, వైసీపి నేతలకు నోటీసులు ఇచ్చి పట్టణంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్టప్రకారం కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
తిరుమల కల్తీ నెయ్యిపై వివాదం కొనసాగుతున్నప్పుడే ధైర్యంగా తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శించుకున్న మొనగాడినని జగన్ నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లున్నారు. కానీ ఈ చర్యతో రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసి తన పార్టీని తానే నాశనం చేసుకొంటున్నానని గ్రహించిన్నట్లు లేదు.




