తిరుపతి వెంకన్నతో ఆటలాడుకోవద్దని… ఆడుకుంటే నాశనం అయిపోతారని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చెపుతున్నారు. అన్యమతస్థుడైన మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా చెపుతున్నారు. టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కూడా చెపుతున్నారు. అయినా అందరూ వెంకన్న చుట్టూనే ప్రదక్షిణాలు చేస్తుండటం విశేషం.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంతో ఇప్పుడు యావత్ దేశ ప్రజలు జగన్ తీరని అపచారం చేశారని భావిస్తున్నారు. ఆయన తరపున సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు, నివేదికలు వెంకన్న భక్తుల ఆగ్రహానికి కాలి బూడిదైపోతున్నాయి. ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదు.
ఈ వ్యవహారంతో వైసీపికి ముఖ్యంగా జగన్కి రాజకీయంగా చాలా నష్టం జరిగిందని వైసీపిలో అందరికీ అర్దమైంది. తాడేపల్లి ప్యాలస్ నుంచి దీనిపై వైసీపి నేతలకు ఓ లైన్ వస్తుందని అప్పుడు ఒకరొకరుగా కలుగుల్లో నుంచి బయటకు వచ్చి సిఎం చంద్రబాబు నాయుడుపై ఎదురుదాడి చేస్తారని ముందే అనుకున్నాము. అదే మొదలైందిప్పుడు.
ముందుగా టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి, తిరుమల శ్రేవారితో ఆడుకుంటున్నవారు అంటే ఆయన ఉద్దేశ్యంలో సిఎం చంద్రబాబు నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు తదితరులు రక్తం కక్కుకొని చచ్చిపోవాలని శాపం పెట్టారు. శ్రీవారి లడ్డూ పేరుతో సిఎం చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు, ప్రధాని నరేంద్రమోడీ జోక్యం చేసుకొని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాజకీయాలలో ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు బలమైన పాయింట్ ఏదీ లేనప్పుడు గత చరిత్ర తిరగేస్తారు. వ్యక్తిగత దూషణలు చేస్తుంటారు.
ఎన్నికలలో టిడిపితో జనసేన పొత్తుపెట్టుకోకుండా అడ్డుకోవాలని జగన్ విఫల ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేవారు. కార్లు మార్చిన్నట్లు భార్యలు మారుస్తాడని వ్యక్తిగత విమర్శలు చేసేవారు.
మళ్ళీ ఇప్పుడు వైసీపి సరిగ్గా అటువంటి పరిస్థితిలోనే చిక్కుకోవడంతో భూమన కరుణాకర్ రెడ్డి ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారంటూ విమర్శలు చేశారు. అంటే వైసీపి వద్ద సెల్ఫ్ డిఫెన్స్ కోసం అస్త్రాలు ఏవీ లేవని స్పష్టం అవుతోంది.
వైసీపి చాలా నిస్సహాయ పరిస్థితులలో చిక్కుకుంది కనుక ఏమీ చేయలేక చంద్రబాబు నాయుడు రక్తం కక్కుకొని భూమన కరుణాకర్ రెడ్డి శపించేశారు.
అయితే పిల్లి శాపలకు ఉట్టి తెగి కింద పడదు.. దానిలో పాలు వెన్న దక్కవని, ఈ శాపాలు బ్యాక్ ఫైర్ అయితే తామే రక్తం కక్కుకొని చావాల్సి వస్తుందని భూమన గ్రహించిన్నట్లు లేదు.




