ఓ అగ్ర హీరో సినిమాపై ఏవిదంగా భారీ అంచనాలు నెలకొని ఉంటాయో, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నా అదేవిదంగా చాలా భారీ అంచనాలు ఉంటాయి. దీనినే మరోవిదంగా చెప్పుకోవాలంటే రాష్ట్రానికి అవసరం ఏర్పడినప్పుడల్లా ప్రజలకు చంద్రబాబు నాయుడే గుర్తొస్తారు. జగన్లాగా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఆయన కోరుకోరు. రాష్ట్ర ప్రజలే ఆయనను పిలిచి అధికార పగ్గాలు అప్పజెపుతుంటారు.
2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆగమ్య గోచరంగా కనిపిస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి బూటకపు సమైక్యాంధ్రా, ప్రత్యేక హోదా ఉద్యమాలు చేసి ప్రజలను ఆకట్టుకొని అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నించారు.
ఒకవేళ అప్పుడే జగన్ చేతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిక్కి ఉండి ఉంటే నేడు దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒకటి ఉండేదా? కనబడేదా? అని అనిపించక మానదు ఈ 5 ఏళ్ళ జగన్ రాక్షస పాలన చూసినందున,
అయితే రాష్ట్ర విభజనతో దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు మాత్రమే చక్కదిద్దగలరనే గట్టిగా ప్రజలు నమ్మడంతో, ఆయన రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. ఆ రోజు ఆయన చక్కదిద్దడం వలననే ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డికి వడ్డించిన విస్తరిలా ఆంధ్రప్రదేశ్ చేతికి అందింది.
అందువల్లే అప్పుడు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి ఆశలు, అంచనాలు లేవనే చెప్పాలి. ఆయన తండ్రి వైఎస్సార్లాగా ఏవైనా మంచి పనులు చేస్తాడేమో అని మాత్రమే అనుకున్నారు.
అయితే ప్రజలు వైఎస్సార్ని తలుచుకొని జగన్ని గెలిపించారు తప్ప అప్పటికే అక్రమాస్తుల కేసులలో 16 నెలలు చంచల్గూడా జైలులో గడిపి బయటకు వచ్చారనే విషయం పెద్దగా పట్టించుకోలేదు. అధికారంలో లేనప్పుడే లక్షల కోట్లు అవినీతికి పాల్పడిన వ్యక్తికి రాష్ట్రాన్ని, రాష్ట్ర ఖజానా తాళాన్ని అప్పగిస్తే ఏమవుతుందని ప్రజలు ఆలోచించలేదు.
తనపై ప్రజలకు ఎటువంటి అంచనాలు లేకపోవడం, తన అక్రమాస్తుల కేసులను, జైలు జీవితాన్ని ప్రజలు పట్టించుకోకపోవడం ఆయన అదృష్టమనే అనుకోవాలి. పైగా తన మొహం చూసి ప్రజలు వైసీపిని గెలిపించడం ఇంకా అదృష్టమే… విడ్డూరమే!
కానీ ప్రజలు తనకు ఇచ్చిన ఒక్క ఛాన్స్ విలువ ఎంతో జగన్ గుర్తించలేక దుర్వినియోగం చేసుకున్నారు. ఇలాంటి ఒక్క ఛాన్స్ కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.
ఏది ఏమైనప్పటికీ జగన్ తాను ఏమిటో ఆంధ్రా ప్రజలకు పూర్తిగా అర్దమయ్యేలా చేశారనే చెప్పాలి. అందుకే ఈసారి 11 సీట్లతో ఏకగ్రీవంగా తిరస్కరించి మళ్ళీ ‘టాస్క్ మేనేజర్’ చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర పగ్గాలు అప్పగించారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఒకరకమైన ఇబ్బందులు నెలకొని ఉండేవి. కానీ ఇప్పుడు 5 ఏళ్ళ జగన్ ఆర్ధిక, పారిశ్రామిక, సామాజిక విధ్వంస పాలన తర్వాత పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి జగన్ ఇచ్చిన బోనస్ సమస్యలని చెప్పవచ్చు. కనుక ఓ వైపు వీటన్నిటినీ చక్కబెట్టుకుంటూనే, అమరావతి, పోలవరం పనులను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎన్నికల హామీలను అమలు చేయవలసి ఉంటుంది. కనుక చంద్రబాబు నాయుడుకి ఈ సారి ఇంకా పెద్ద టాస్క్ అప్పజెప్పిన్నట్లే భావించవచ్చు.




