కాంగ్రెస్‌ ఈ అవకాశాలను అందిపుచ్చుకోగలదా?

BJP Congress

జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల పట్ల దేశంలో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ అవి శక్తివంతమైన పార్టీలని నిరూపించుకుంటూనే ఉన్నాయి.

ADVERTISEMENT

హర్యానాలో కాంగ్రెస్‌ ఓడిపోయిన్నప్పటికీ 90కి 37 సీట్లు గెలుచుకొని రెండో స్థానంలో నిలిచింది. అదేవిదంగా జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ ఓడిపోయినప్పటికీ 90కి 29 సీట్లు గెలుచుకొని రెండో స్థానంలో నిలిచింది. కనుక ఈ మిశ్రమ ఫలితాలు ఆ రెండు పార్టీలకు కాస్త ఊరటనిచ్చిన్నట్లే భావించవచ్చు.

కనుక ఇప్పుడు ఈ రెండు పార్టీలు వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబోతున్న ఢిల్లీ, మహారాష్ట్ర, బిహార్‌, ఝార్ఖండ్ రాష్ట్రాలపై దృష్టి సారిస్తున్నాయి.

కానీ బీజేపీ చేసుకున్న కొన్ని రాజకీయ తప్పిదాలు కాంగ్రెస్ పార్టీకి వరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఢిల్లీలో అర్వింద్ కేజ్రీవాల్‌ నేతృత్వంలో ఆమాద్మీ పార్టీని ఓడించలేక బీజేపీ చాలా ఇబ్బంది పడుతోంది. కనుక లిక్కర్ స్కామ్‌ కేసులో సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌, డెప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలను అరెస్ట్ చేసి ఆ పార్టీని, ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించింది.

కానీ అర్వింద్ కేజ్రీవాల్‌ బీజేపీ కంటే ఎప్పుడూ మూడడుగులు ముందే ఉంటున్నారు. బెయిల్‌పై విడుదలై బయటకు రాగానే ‘ప్రజలు నేను నిరాపరాధినని నమ్మితేనే ఆ కుర్చీలో కూర్చుంటానంటూ’ ముఖ్యమంత్రి పదవికి రాజినామా చేసారు.

ఇది బీజేపీ కూడా ఊహించని ఎత్తుగడే. కనుక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల మద్యకు వెళ్ళి వారి సానుభూతి, నమ్మకం పొందుతున్న అర్వింద్ కేజ్రీవాల్‌ని ఏవిదంగా ఎదుర్కోవాలో బీజేపీకి తెలీని పరిస్థితి.

ఢిల్లీలో అర్వింద్ కేజ్రీవాల్‌ని, బీజేపీని ఎదుర్కొని కాంగ్రెస్‌ గెలవడం చాలా కష్టమే. కానీ బీజేపీ-ఆమాద్మీ పార్టీల రాజకీయాలతో విసిగిపోయిన ఢిల్లీ ప్రజలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్‌ ఇంతకు మించిన గొప్ప అవకాశం మళ్ళీ లభించకపోవచ్చు.

ఇక మహారాష్ట్రలో సొంతంగా అధికారంలోకి రావాలనే దురాశతో చిరకాలంగా మిత్రపక్షంగా ఉన్న శివసేనని నిలువునా చీల్చడానికి బీజేపీ వెనకాడలేదు. బీజేపీ ఆవిదంగా చేయడాన్ని మహారాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

కానీ శివసేన రెండుగా చీలిన తర్వాత బలహీనపడింది. శరత్ పవార్ ‘ఎన్‌సీపీ’ సొంతంగా అధికారంలోకి రాగలిగే పరిస్థితి లేదు. కనుక మహారాష్ట్ర ప్రజలు ఒకవేళ బీజేపీ, శివసేనలని వద్దనుకుంటే కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపవచ్చు.

బిహార్‌ సిఎం నితీష్ కుమార్‌ ప్రస్తుతం ఎన్డీయేలోనే ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు ఏవిదంగా వ్యవహరిస్తారో బీజేపీకి అంతుపట్టడం లేదు. ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ ఈసారి సొంత పార్టీతో బిహార్‌ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీ సరైన వ్యూహాలు, పొత్తులతో అడుగు ముందుకు వేస్తే బిహార్‌లో లాట్రీ తగిలే అవకాశం ఉంతుంది.

ఝార్ఖండ్ ప్రజలకు శిబూ సొరేన్, హేమంత్ సొరేన్ కుటుంబం పట్ల చాలా గౌరవం ఉంది. ఇది పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం హేమంత్ సొరేన్‌ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టింది. ఇది ఝార్ఖండ్ ప్రజలకి ఆగ్రహం కలిగించేదే. ఆయన బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చేశారు. కనుక ఝార్ఖండ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సొరేన్‌ల రూపంలో ఓ మంచి బలమైన మిత్రుడు సిద్దంగా ఉన్నారు.

ఈ పరిణామాలన్నీ బీజేపీకి నష్టం కలిగించేవే. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాలని అందిపుచ్చుకొని విజయం సాధించగలదా లేదా? చూడాలి.

ADVERTISEMENT
Latest Stories