ఇంతకీ బొత్స ఎవరి గురించి మాట్లాడుతున్నారు?

Botsa Satyanarayana Tirumala Laddu Controversy

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై మీడియాతో ఎలా మాట్లాడాలనే దానిపై వైసీపి నేతలకు తాడేపల్లి ప్యాలస్‌ నుంచి మార్గదర్శకాలు వచ్చిన్నట్లే ఉన్నాయి.

ADVERTISEMENT

వైసీపి కొత్తగా అధికార ప్రతినిధులను నియమించుకున్నప్పటికీ ఎవరూ ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చి ఈ అంశం గురించి మాట్లాడటం లేదు. కనుక ఎమ్మెల్సీ పదవి పొందినందుకు ముందుగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి సున్నితమైన ఈ అంశం గురించి మాట్లాడవలసి వచ్చింది.

అయితే జగన్మోహన్‌ రెడ్డిని వెనకేసుకు రాబోయి ఆయన మాట్లాడిన మాటలు వింటే, అవి పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేశాయి.

బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే, “వంద రోజుల కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అందుకే సిఎం చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.

అయినా దేవుడితో రాజకీయాలు చేయడం ఎందుకు? దేవుడితో ఆటలాడితే ఎంతటివారికైనా ఎప్పటికైనా శిక్ష తప్పదు. దేవుడికి అపచారం చేసినవారు శిక్ష అనుభవించాల్సిందే.

చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే దీనిపై సీబీఐ చేత విచారణ జరిపించాలి. తప్పు జరిగిన్నట్లు తేలితే బాధ్యులైన అధికారులపై కటిన చర్యలు తీసుకోవాలి.

మీడియాలో ఓ వర్గం దీని గురించి తప్పుడు వార్తలు వ్రాస్తున్నాయి. ఇప్పటికైనా పార్టీలు, పత్రికలు ఈ దుష్ప్రచారం ఆపాలి. వాస్తవాలను పక్కన పెట్టి వైసీపిపై బురద జల్లడం ఎంత వరకు న్యాయం?

మీ రాజకీయాల కోసం దేవుడి పేరుతో కోట్లాది ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటారా? తిరుమలలో ఎటువంటి తప్పు జరగలేదని ఐవైఆర్ కృష్ణారావు చెపుతున్నారు కదా? ఆయనతో నేను ఏకీభవిస్తాను. చంద్రబాబు నాయుడు నిరూపించలేకపోతే ప్రజలకు బేషరతుగా క్షమాపనలు చెప్పాలి,” అని అన్నారు.

గతంలో తిరుమల శ్రీవారితో ఆటలాడుకున్నది ఎవరో వారికి ఏమయిందో అందరూ చూశారు. ఆ తర్వాత జగన్‌ కూడా ఎన్నికలలో ఓడిపోయి ఆ ఫలితం అనుభవిస్తున్నారు. అందుకే దేవుడితో ఆటలాడుకుంటే ప్రమాదమని బొత్స సత్యనారాయణ హెచ్చరిస్తున్నట్లుంది తప్ప జగన్‌ని వెనకేసుకు వస్తున్నట్లు లేదు.

దీనిపై సీబీఐ చేత విచారణ జరిపించమని, తప్పు జరిగితే దోషులను శిక్షించమని కూడా బొత్స సత్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు. సీబీఐ రంగంలో దిగితే ముందుగా ఆ వలలో చిక్కుకునేది ఇద్దరు మాజీ ఛైర్మన్లు, ఈవో ధర్మారెడ్డి… ఆ తర్వాత దీనికంతటికి బాధ్యత వహించాల్సిన మాజీ సిఎం జగన్‌.

కనుక బొత్స సత్యనారాయణ మాట్లాడిన ఈ మాటలు, చేసిన ఈ విమర్శలు, ఆరోపణలు, సీబీఐ విచారణకి డిమాండ్ చేయడం అన్నీ తమని తామే దోషులుగా ప్రజల ముందు నిలబెట్టుకుంటున్నట్లు ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories