బిఆర్ఎస్ రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఆధారమా.? ఏపీ నీటి ప్రోజెక్టుల మీద, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల మీద విమర్శలు, ఆరోపణలు చేయనిదే బిఆర్ఎస్ రాజకీయం ముందుకెళ్లలేదా.? అనే ప్రశ్నలకు బిఆర్ఎస్ నేతలు తమ వ్యాఖ్యలతో మరింత బలం చేకూరుస్తున్నారు.
నాటి పోలవరం నుంచి నేటి బనకచర్ల వరకు తెలంగాణ నీటి హక్కులను హరించి, తెలంగాణ ప్రజల నేటి అవసరాలను దొంగలించి ఏపీ నీటి ప్రాజెక్టులు నిర్మిస్తుందంటూ అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తూ రాజకీయ విమర్శలు గుప్పిస్తూ బిఆర్ఎస్ నేతలు రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ ప్రాంతీయ చిచ్చు రేపడానికి సిద్దపడ్డారు.
అలాగే ఈ రాజకీయ ఉచ్చులోకి, తమ పార్టీ వేసే రాజకీయ పద్మవ్యూహంలోకి తమ ప్రత్యర్థి పార్టీలను కూడా లాగడం బిఆర్ఎస్ కి వెన్నతో పెట్టిన విద్యనే చెప్పాలి.
మరి ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి ఇలా ఇరు రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో రాజకీయ చేయడం తద్వారా తమకు, తమ పార్టీకి రాజకీయ లబ్ది చేకూర్చుకోవడం వారికీ అలవాటుగా మారిపోయింది. అయితే తాజాగా మీడియా ముందుకొచ్చిన హరీష్ బనకచర్ల అంశంలో మరోకోణాన్ని బయటకు తెచ్చారు.
ఇన్నాళ్లు ఏపీ అక్రమంగా, అన్యాయంగా తెలంగాణకు విరుద్ధంగా బనకచర్ల ప్రాజెక్ట్ ని నిర్మిస్తుందంటూ మీడియా ముందు నానా హంగామా చేసిన హరీష్ ఇక ఇప్పుడు బనకచర్ల కంటే నల్లమల సాగర్ మరింత ప్రమాదం అంటూ రెచ్చిపోయారు. బనకచర్ల రూపం మార్చుకుని నల్లమల సాగర్ గా మారిందన్నారు.
అయితే ఇన్నాళ్లుగా బనకచర్ల బనకచర్ల అంటూ నానా హంగామా చేసిన బిఆర్ఎస్ ఇప్పుడు యూ టర్న్ తీసుకుని బనకచర్ల కాదు నల్లమల ప్రాజెక్ట్ తెలంగాణకు అన్యాయమంటూ మరో కొత్తకథకు శ్రీకారం చూట్టారు.




