రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారం పక్షాలు ప్రతిపక్షాలయ్యాయి, ప్రతిపక్షాలు అధికార పక్షాలుగా రూపాంతరం చెందాయి. అయితే రెండు రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాల తరువాత ప్రతిపక్షాలుగా మారిన బిఆర్ఎస్, వైసీపీ పార్టీలు ప్రభుత్వాలు తీసుకునే ఒక్క ప్రజా వ్యతిరేక నిర్ణయం కోసం వేచి ఉన్నాయి.
అయితే ఆ అవకాశాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా రూపంలో బిఆర్ఎస్ పార్టీకి అందించినట్టే కనిపిస్తుంది. ఎంతో మంది తమ జీవిత కాలం కష్టాన్ని హైడ్రా కళ్ళ ముందే కూల్చేస్తుంటే రేవంత్ సర్కారు మీద నిప్పులు చెరుగుతున్నారు బాధితులు. ఆయా కుటుంబాలు తమ ఆవేదన వినిపించడానికి, తమకు న్యాయం కావాలంటూ “మాకొద్దు ఈ కూల్చివేతల ప్రభుత్వం” అంటూ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్దకు బారులు తీరుతున్నారు.
మరి కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ కి ఆ ఒక్క అవకాశాన్ని ఇచ్చిందా.? ఇక ముందు ఇస్తుందా.? అంటే ఇప్పట్లో జగన్ కు బాబు ఆ అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు. గత ప్రభుత్వ పాలకుల అనాలోచిత నిర్ణయాలతో గాడి తప్పిన ఏపీని తిరిగి గాడిన పెట్టేందుకు ముందుగా పెట్టుబడులను రాష్ట్రానికి తిరిగి రప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
అలాగే గత ఐదేళ్లుగా నిద్రావస్థలో మునిగిపోయిన వ్యవస్థలన్నింటిలోను చలనం కల్పిస్తూ వాటిని ప్రజాప్రయోజనాల కోసం వినియోగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో సమాధి అయినా రాజధాని అమరావతికి తిరిగి జీవం పోస్తున్నారు.
ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరిపించుకోగలిగితే ఇప్పుటికే కాదు ఈ ఐదేళ్లల్లో ఎప్పటికి కూటమి ప్రభుత్వం వైసీపీకి అవకాశం ఇవ్వకపోవచ్చు. అయితే హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వం ను కూల్చడానికి బిఆర్ఎస్ కు ఒక ఆయుధం దొరికినట్లయితే శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదంతో వైసీపీ ని మరోమెట్టు కిందకు దించడానికి కూటమి ప్రభుత్వానికి మరో ఆయుధం చిక్కినట్లయ్యింది.
ఇప్పటికే జిత్వాని కేసులో వైసీపీ వ్యవహారం ప్రజలలో వైసీపీని దోషిగా నిలబెడితే ఇప్పుడు తిరుమల వివాదం వైసీపీ కి అంతు చిక్కని చిక్కుముడిగా మారిపోయింది. లడ్డు వివాదంలో వైసీపీ ప్రభుత్వం మీదకు దూకుడుగా ముందుకు వెళ్లలేని పరిస్థితి, అలా అని వెనకడుగు వేయలేని దుస్థితి. రెండికి చెడ్డ రేవడి మాదిరి మేకపోతు గాంభీర్యాలు వలకపోస్తూ కాలం నెట్టుకు రావలసిన అవసరం వైసీపీది.
అయితే బిఆర్ఎస్ పార్టీకి హైడ్రా దొరికినట్లు తమకు కూడా ఏపీలో ఏదొక ప్రజా వ్యతిరేక నిర్ణయం ప్రభుత్వం నుండి బయటకు రాకపోతుందా అంటు వేయి కళ్ళతో రేపటి కోసం వైసీపీ నేతలు , ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ బెంగుళూర్ ప్యాలస్ నుంచి తాడేపల్లి ప్యాలస్ కు చెక్కర్లు కొడుతూ వేచి చూస్తున్నారు.




