బిఆర్ఎస్ – వైసీపీ రెండు రాజకీయ పార్టీలు కూడా రాజకీయంగా ఒకే నావలో ప్రయాణం చేస్తున్నాయా.? అనేవిధంగా చెల్లెళ్ళ వివాదాల నుంచి రాజకీయ విభేదాల వరకు అన్నింటిలోను ఒక పార్టీని మరో పార్టీ అనుసరిస్తుందా అన్నట్టుగా ఈ రెండు పార్టీల రాజకీయం నడుస్తుంది.
దశాబ్దాల నాటి రాజకీయ అనుభవం ఉన్న బిఆర్ఎస్ సైతం కొన్ని కొన్ని అంశాలలో వైసీపీ ని అనుకరిస్తుందా.? జగన్ మాదిరి రప్ప రప్ప రాజకీయాలను ప్రోత్సహిస్తుందా.? బూతు రాజకీయాలను స్వాగతిస్తుందా.? అన్నట్టుగా బిఆర్ఎస్ రాజకీయంలో బూతులు కూడా ఒక భాగంగా మారిపోయాయి.
2019 ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ బూతు రాజకీయాన్ని పెంచి పోషించింది. ప్రత్యర్థి పార్టీల నేతల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, తద్వారా తన ఆపార్టీ క్యాడర్ లో జోష్ నింపడం, ప్రత్యర్థి పార్టీ క్యాడర్ ను రెచ్చకొట్టడం వైసీపీ రాజకీయంలో ఒకభాగమైపోయింది.
అయితే నాడు తన బూతు రాజకీయానికి తిరుగేలేదు, తన విధానాలతో ప్రత్యర్థి పార్టీలు తగ్గుతున్నాయి, ప్రజలు మన వైపే ఉంటారు, ఇక రాబోయే ఎన్నికలలో మనదే రాజ్యం, వై నాట్ 175 అంటూ వైసీపీ విర్రవీగింది. అయితే ఆ తరువాత ఫలితాలు చూసి కుప్పకూలింది.
వైసీపీ బూతు రాజకీయాన్ని గాలి మాటలుగా కొట్టిపారేశారు ఏపీ ఓటర్లు, వైసీపీ ఈజ్ ఇంజురియెస్ టూ ఏపీ పాలిటిక్స్ అంటూ 151 తో అందలం ఎక్కిన వైసీపీ ని 11 తో పాతాళానికి తొక్కారు. అయినా కూడా వైసీపీ కి ఇప్పటికి తత్త్వం బోధపడలేదు.
అవే గాలి మాటలను నమ్ముకుని అంబటి వంటి సీనియర్ రాజకీయ నాయకుడు సైతం రాష్ట్ర ముఖ్యమంత్రిని బూతులతో తిడుతూ నడిరోడ్డు మీద వీరంగం వేశారు. సరిగ్గా ఇదే మాదిరి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బూతులతో రెచ్చిపోయారు.
అయితే తాజాగా తెలంగాణలో విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఒక్కసారి పరిశీలిస్తే, కాంగ్రెస్ గెలుపుకి బిఆర్ఎస్ ఓటమికి మధ్య బిఆర్ఎస్ నాయకుల ‘కారు కూతలు’ ప్రధాన పాత్ర పోషించాయని, ఇకనైనా బిఆర్ఎస్ ఆ బూతు రాజకీయాలకు దూరం కాకుంటే బిఆర్ఎస్ తెలంగాణ నుంచి దూరం కాకతప్పదు అంటూ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు.
బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తో బయటకొచ్చిన తానూ మరో కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాలలోకి రావడం సహించలేక బిఆర్ఎస్ నేతల నుంచి బిఆర్ఎస్ సోషల్ మీడియా సైన్యం వరకు తన పై, తన రాజకీయం పై కారు కూతలు కూస్తున్నారని,
ఇప్పటికైనా బిఆర్ఎస్ తత్త్వం తెలుసుకుని, ప్రజల మధ్యకు వచ్చి ప్రభుత్వం పై పోరాటాలు చెయ్యాలంటూ కవిత బిఆర్ఎస్ అధినాయకత్వానికి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే కవిత చెపుతున్నట్టు గులాబీ నేతల బూతులు కారు కూతలైతే వైసీపీ నాయకుల బూతులు గాలి మాటలనాలా.?
మరి ఆ గాలి మాటలకు ఈ కారు కుట్రలకు ప్రజామోదం లభించదు అనేది ఎన్నిలకల ఫలితాలతో నిర్దారణ అయినప్పటికీ ఈ రెండు పార్టీ తమ రాజకీయ తప్పు తెలుసుకుని ప్రజలిచ్చిన రిటర్న్ గిఫ్ట్ తో యూ టర్న్ తీసుకుంటారా.? లేదా ఏదిఏమైనా తమ వాదాన తమదే అంటూ ముందుకెళ్తారా.?






