కూటమిలో మిత్ర పక్షాలు కలిసి పనిచేయడం, పరస్పరం సహకరించుకోవడం సర్వసాధారణమే. ఇది ప్రజాస్వామ్య బద్దమైన పొత్తులు, ఒప్పందాలు, అవగాహనతో ఏర్పడినవి కనుక ఎవరూ వేలెత్తి చూపలేరు. కానీ ఎటువంటి పొత్తులు లేకపోయినా కొన్ని పార్టీలు రాజకీయ అవసరాల కోసం పరస్పరం సహకరించుకుంటాయి. దానినే వాటి ప్రత్యర్ధి పార్టీలు ‘కుమ్మక్కు’ అని ఎద్దేవా చేస్తుంటాయి.
బహిరంగంగా పొత్తు పెట్టుకోలేదు కనుక ‘మేము సింగిల్ సింహాలం’ అని గొప్పలు చెప్పుకుంటూ, పొత్తులు పెట్టుకోవడాన్ని రాజకీయ వ్యభిచారం, చాతకానితనం, బలహీనతగా అభివర్ణిస్తుంటాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఏపీలో వైసీపీ ఇలాంటి ‘సింగిల్ సింహాలే.’ ఈ రెండు సింగిల్ సింహాల అహంభావంతో సహా వాటి ఆలోచనా ధోరణి, వ్యవహార శైలి ఇంచుమించు ఒకేలా ఉంటాయి కనుక రాష్ట్రాలు వేరైనా కలిసి రాజకీయాలు చేస్తుంటాయి. పార్టీలు,. వాటి మీడియా కూడా పరస్పరం సహకరించుకుంటాయి.
ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తమిళనాడులో అలాంటి మరో నేస్తం సిఎం జోసఫ్ విజయ్ దొరికారు. ఆయన సింగిల్ సింహం కాదు కానీ ఎక్కడో భావస్వారూప్యత కుదిరినట్లుంది. అందుకే విజయ్ సిఎం అయ్యేందుకు జగన్ ఓ చెయ్యేశారని, అందుకు అయన కూడా థాంక్స్ చెప్పారని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇది నిజమైతే భావస్వారూప్యత కలిగిన ఏపీ, తెలంగాణలోని రెండు తెలుగు సింహాలు ఎన్నికలలో పరస్పరం సహకరించుకున్నట్లే, వచ్చే ఎన్నికలలో ‘మూడు సింహాలు’ పరస్పరం సహకరించుకోవచ్చు. ఆలోగా ఇక్కడి తెలుగు సింహాలు, వాటి మీడియా, సోషల్ మీడియాలు తమిళ సింహానికి బ్యాక్ సపోర్ట్ ఇస్తూ ఉంటే వాటి మద్య అనుబంధం కూడా బలపడుతుంది.




