వివేకా హత్యకేసులో ఎన్నెన్ని సిత్రాలో…

CBI_YS_Bhaskar_Reddyవైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మూడడుగులు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు నత్తనడకన సాగుతోంది. ఈ కేసులో హంతకులు ఎవరనేది నిర్దారించి ఈపాటికి శిక్షలు కూడా విధించాల్సి ఉండగా నేటికీ నిందితుల బెయిల్‌ పిటిషన్లపై విచారణలు కొనసాగుతున్నాయి.

తెలంగాణ హైకోర్టు నిందితులకు బెయిల్‌ నిరాకరిస్తే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడం మళ్ళీ అక్కడేదో మెలికపెట్టి మళ్ళీ హైకోర్టుకి వచ్చి ఆ కేసు విచారణను కొనసాగిస్తుండటం ‘రొటీన్’ అయిపోయింది.

ADVERTISEMENT

ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, వారి అనుచరుడు ఉదయ్ కుమార్‌ రెడ్డి నిందితులని సీబీఐ పేర్కొంది. కానీ వారిలో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ రెడ్డిలను మాత్రమే అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలుకి పంపింది. ఇవాళ్ళ వారిద్దరికీ బెయిల్‌ నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. తర్వాత ఏమి జరుగుతుందో ముందే చెప్పుకొన్నాము. కనుక దాని గురించి ఆలోచించనవసరం లేదు.

వారిరువురికీ బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారనేది సీబీఐ వాదన. మరి బయట ఉన్న మరో నిందితుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేయకుండా ఉంటారా?అంటే ప్రభావితం చేస్తారనే సీబీఐ వాదిస్తోంది. కానీ అవినాష్ రెడ్డిని కేవలం కాగితాల మీదే అరెస్ట్‌, బెయిల్‌ చూపిస్తోంది!

ఇక ఈ కేసు కీలక పరిణామం ఏర్పడిన ప్రతీసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవినాష్ రెడ్డిని వెనకేసుకు వస్తూ మాట్లాడుతుంటారు. తద్వారా ఆయన వెనక వైసీపీ ప్రభుత్వం ఉందని విస్పష్టంగా చెపుతున్నారనుకోవచ్చు. ఈ కేసులో నిందితులకు అండగా ప్రభుత్వం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం సాక్షులను ప్రభావితం చేయడం కాదా?ఒకే కేసులో ఒకరిని అరెస్ట్‌ చేసి మరొకరిని బయట తిరగనిస్తుండటాన్ని ఏమనుకోవాలి ?

భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ రెడ్డి ఎలాగూ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సవాలు చేయకుండా ఉండరు. చేస్తే ఈ కధ మళ్ళీ మొదటికొస్తుంది. ఈ కేసులో ఈ విదంగా సాగుతున్నప్పుడు వివేకా హంతకులని సీపీఐ కోర్టు ఇంకా ఎప్పుడు నిర్ధారిస్తుంది? వారికి శిక్షలు ఎప్పుడు పడతాయి?అసలు పడతాయా లేదా?

ADVERTISEMENT
Latest Stories