చంద్రబాబు స్కిల్ కేసులో గడిచిన నెల రోజులుగా న్యాయస్థానాలలో విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజో రేపో బాబు విడుదల అంటూ నెల రోజుల టీడీపీ శ్రేణుల నిరీక్షణలు నేటితో ఒక కొలిక్కి వస్తాయి అని భావించిన వారందరికీ సుప్రీం కోర్ట్ కేసు విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లకు మళ్ళీ నిరాశే మిగిలింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను విచారణ చేపట్టిన ధర్మాసనం సెక్షన్ 17 – A పై ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అలాగే బాబు ఎటువంటి నేరానికి పాల్పడలేదని, ఆయన పై ఉన్న ఆరోపణలకు అధికారులు ఎలాంటి ఆధారాలు చూపలేకపోతున్నారని బాబు తరుపు న్యాయవాదులు తమ వాదన వినిపించడంతో ఇరు వర్గాల వాదనలు విన్నా ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేస్తూ కేసుని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
అలాగే మరో పక్క ఫైబర్ గ్రిడ్ కేసులో బాబు ముందస్తు బెయిలు పిటిషన్ పై కూడా విచారణ చేపట్టిన ధర్మాసనం దానిని కూడా శుక్రవారానికి వాయిదా వేసింది. ఇలా చంద్రబాబు కేసులో న్యాయస్థానాలు వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తుండడం, తెలుదేశం పార్టీ నేతలలో, కార్యకర్తలలో సహనాన్ని పరీక్షిస్తుంది. ఒకపక్క చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల పై ఆందోళనలో ఉన్న బాబు కుటుంబసభ్యులు, పార్టీ నేతలు కోర్టుల తీర్పులతో మరికొంత నిరుత్సహంలోకి వెళ్తున్నారు.
విచారణ తుది దశకు వచ్చిన నేపథ్యంలో బాబుకి కోర్టులలో ఊరట లభిస్తుందని తద్వారా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని బాబు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. హత్యలు చేసిన వైసీపీ నేతలకు న్యాయస్థానాలు బెయిలు మంజూరుచేస్తూ చంద్రబాబుకి మాత్రం వాయిదాలతో కోర్టులు తీర్పులను ముగించడంతో వైస్ జగన్ వ్యవస్థలను ఎంతలా ప్రభావితం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్ధమవుతుంది అంటూ టీడీపీ వర్గాలు గుర్రుగా ఉన్నారు.
రోజు రోజుకి వాయిదాల పరంపర కొనసాగడంతో అసలు బాబుకి బెయిలు వస్తుందా? రాదా? అనే సందేహంలోకి టీడీపీ వర్గాలు వెళ్లిపోతున్నాయి. వచ్చే శుక్రవారంతో అయినా కోర్ట్ తీర్పులో మార్పు ఉంటుందా? ఈ వాయిదాల పర్వానికి అంతుంటుందా? అనేది వేచి చూడాల్సి వస్తుంది.




