ఇండియాలో అత్యంత పరిశుభ్రంగా ఉండే నగరాల జాబితాను సీఎస్ఈ (సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ సెంటర్) విడుదల చేసింది. ఈ జాబితాలో టాప్ 3 స్థానాలలో ఉన్న నగరాలు దక్షిణ భారతదేశం నుండి ఎంపిక కావడం విశేషం. కేరళలోని అలెప్పీ, గోవా క్యాపిటల్ పనాజి, కర్ణాటకలోని మైసూర్ లు మొదటి మూడు స్థానాల్లో నిలిచి తమ పరిశుభ్రతను చాటాయి.
దేశంలో వ్యర్థ పదార్థాల నిర్వహణా పద్ధతులపై ‘నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్’ పేరిట సీఎస్ఈ తన తాజా నివేదికను విడుదల చేసింది. ‘వేస్ట్ మేనేజ్ మెంట్’లో దేశ రాజధాని అంత మెరుగైన పనితీరు చూపడం లేదని తెలిపింది. మునిసిపల్ వ్యర్థాల నిర్వహణలో ఢిల్లీ అధికారులు అట్టడుగు స్థాయి పనితీరు చూపుతున్నారని పేర్కొంది. ఇండియాలో రోజుకు 80 వేల మెట్రిక్ టన్నుల వేస్ట్ పట్టణ ప్రాంతాల నుంచి వస్తోందని, మరో 20 ఏళ్లకు ఇది 260 మిలియన్ టన్నులకు పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది.
అలెప్పీలో ప్రజలు ఉత్తమమైన పద్ధతులను అవలంబిస్తూ, కంపోస్ట్, నాన్ కంపోస్ట్ ను వేరు చేసి కొంత ఆదాయం కూడా సంపాదిస్తూ, మిగతా పట్టణాల వాసులకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొంది. దక్షిణాదిలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో అలెప్పీ కూడా ఒకటి. అలా పర్యాటక ప్రాంతంగా ఉండి కూడా అలెప్పీకి ఈ గౌరవం దక్కడం సామాన్యమైన విషయమేమీ కాదు, ఈ నగరాన్ని చూసి నేర్చుకోవాల్సినది చాలా ఉంది అంటున్నారు పరిశీలకులు.



