విజయవాడలో నిర్వహించిన సీఐఐ నాలుగవ సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు… ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ప్రస్తుతం అన్ని దేశాలు భారత్ వైపే చూస్తున్నాయని, చైనా ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో ప్రపంచం దృష్టి మనదేశంపై పడిందని కీలక వ్యాఖ్యలు చేసారు.
ఆంధ్రప్రదేశ్ రెండంకెల వృద్ధిని సాధించిందని, భారత్ లో ఆ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రంగా గుర్తింపు పొందిందని చంద్రబాబు పేర్కొన్నారు. సీఐఐకు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో స్థలం కేటాయిస్తామని పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ.. పరిశ్రమలు పెట్టేందుకు వస్తే వెంటనే అనుమతులు ఇస్తున్నట్లు, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఉందని చెప్పారు.
నిరంతర విద్యుత్, మానవ వనరులు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సాంకేతికత, ఐవోటీని కూడా పాలనలో భాగం చేసినట్లు పేర్కొన్నారు. ఇందు నిమిత్తం తమ నేతలకు శిక్షణ కూడా ఇచ్చామని, రాష్ట్రాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.



