కృష్ణాజిల్లా, ఉంగుటూరులో మండలంలో పొట్టిపాడులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు. “ఎన్టీఆర్ ఒక మనిషి కాదు, ఒక వ్యవస్థ అని, వెంకటేశ్వరుడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో దివంగత నందమూరి తారక రామారావు చూపించారని” అన్నారు.
ఎన్టీఆర్ సినిమాల్లో ఎన్నో వేషాలు వేశారని, రాజకీయాల్లోనూ చక్రం తిప్పారని, కాంగ్రెస్ ను ఎదుర్కొన్న తీరు అద్భుతమని, కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడడానికి ఎన్టీఆర్ కారణమయ్యారని అన్నారు. ఎన్టీఆర్ నిమ్మకూరులో మామూలు కుటుంబంలో పుట్టారని, ఆయన పడిన శ్రమ, కృషి ఓ గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది. అందరి దేవుళ్ల రూపం ఆయనలో చూసుకున్నాం, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో అమరావతిలో ఎంతో విశ్వాసంతో ముందుకు వెళదాం. నేను ఎన్టీఆర్ తో పనిచేయడం వల్ల నుంచి అనేక విషయాలు నేర్చుకున్నానని అన్నారు.
ఎన్టీఆర్ ఏది చెబుతారో అదే పాటిస్తారని, తిండి, బట్ట, ఇల్లు ముఖ్యమని భావించి పేదలకు వాటిని అందించడానికి ఎంతో కృషి చేశారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేసిన దుర్మార్గమైన చర్యతో కట్టుబట్టలతో వచ్చాం. ఎన్టీఆర్ ఇచ్చిన మనోధైర్యంతో ముందుకు వెళదాం. మనకు అన్యాయం చేసిన వారి గుండెల్లో నిద్రపోదాం. అభివృద్ధి చేసి చూపిద్దాం. నేను ఏ పని చేసినా పేదవాళ్లని దృష్టిలో పెట్టుకొని చేస్తా. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీ ఇంటి పెద్ద దిక్కుగా ఉంటానని, అలాగే ఉంటానని అన్నారు చంద్రబాబు.



