ఇల్లు, కుటుంబం… అంటే ఒక చిన్న సురక్షితమైన ప్రపంచం. కానీ దానిలోనే ఎవరికీ భద్రత లేకపోతే? ఒకరినొకరు చంపేసుకుంటుంటే?ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి కలిగితే?నేడు రోజూ ఇవే వార్తలు కనిపిస్తున్నాయి.
చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలో ఓ మహిళ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. భర్తతో కలిసి బైక్పై గుడికి వెళ్ళిన ఆమె ముందే వేసుకున్న పథకం ప్రకారం అతని ప్రాణాలు తీసింది.
కొడుకు కోడలు రాత్రయినా ఇంటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఆమె ప్రియుడు, మరో వ్యక్తి సాయంతో భర్తని హత్య చేసిన తర్వాత హంతకులతో కలిసి అదే బైక్పై వారితో కలిసి పరారి అయినట్లు గుర్తించడంతో అసలు కథ బయటపడింది.
తమిళనాడుకు చెందిన రమేష్, కుప్పంకి చెందిన హాసిని రెండేళ్ళ క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఏడాది వయసున్న పాప ఉంది. రమేష్ హోసూర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
హాసినికి యుగంధర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. కనుక భర్తని అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రియుడితో కలిసి భర్తని హత్య చేసి సమీపంలో అటవీ ప్రాంతంలో శవాన్ని పడేసి ప్రియుడితో పారిపోయింది.
భార్యాభర్తలు ఇద్దరూ కనిపించకపోతే ఎవరికీ తనపై అనుమానం రాదనుకుంది. కానీ సీసీ ఫుటేజిలో అసలు విషయం బయటపడింది.
భార్యాభర్తల మద్య మనస్పర్ధలు వస్తే లేదా ఇలాంటి వివాహేతర సంబంధాలు ఏర్పడితే హత్యలు, ఆత్మహత్యలు చేసుకోవడమే పరిష్కారమా? మాట్లాడుకొని విడిపోయి ఎవరిమానాన్న వారు జీవించవచ్చు కదా? కానీ ఇలా ఒకరినొకరు చంపేసుకోవడం దేనికి?




