ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షోలకు ఇసుక వేస్తే రాలనంతగా జనం తరలివస్తున్నారు. ఈరోజు అదోని పట్టణంలో రోడ్ షోకి వేలాదిగా ప్రజలు తరలిరావడంతో చంద్రబాబు నాయుడి వాహనం ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది.
సాధారణంగా చంద్రబాబు నాయుడు పర్యటనలో పసుపు చొక్కాలు ధరించిన తెలుగు తమ్ముళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ ఈ మూడు రోజుల యాత్రలో వారికంటే సాధారణ ప్రజలే ఎక్కువగా కనిపించడం విశేషం. పట్టణంలో జనమంతా అక్కడే ఉన్నారా?అన్నంతగా తరలివచ్చారు. ఇక ఆ మార్గంలో ఎత్తైన భవనాలు, గోడలు, చివరికి ఫ్లెక్సీ బ్యానర్లు కట్టిన స్థంభాలపైకి ఎక్కి మరీ చంద్రబాబు నాయుడుకి ఆదోని పట్టణ ప్రజలు హర్షధ్వానాలతో ఘనస్వాగతం పలికారు.
చంద్రబాబు నాయుడు కర్నూలులో పర్యటించాలని నిర్ణయించుకొన్నప్పుడు టిడిపి నేతలు కాస్త ఆందోళన పడిన మాట వాస్తవం. ఎందుకంటే అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్న టిడిపి మూడు రాజధానులును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాటిలో కర్నూలు న్యాయరాజధానిగా ఉన్నందున దానినీ వ్యతిరేకిస్తున్నట్లే లెక్క. కనుక చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో వైసీపీ నేతలు విద్వేషాలు రెచ్చగొడితే భారీగా అల్లర్లు జరిగే ప్రమాదం ఉంటుందని భయపడ్డారు.
కానీ అందుకు పూర్తి భిన్నంగా ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో వేలాదిగా జనాలు తరలివచ్చి చంద్రబాబు నాయుడు నీరాజనాలు పలుకుతున్నారు. వారిని చూసి చంద్రబాబు నాయుడు కూడా మరింత ఉత్సాహంగా ప్రసంగిస్తున్నారు. ఆయన ప్రసంగాలకు ప్రజలు కూడా హర్షధ్వానాలతో సంఘీభావం తెలుపుతున్నారు. అసలు ఈ స్థాయిలో జనాలు తరలివస్తారని టిడిపి నేతలు ఎవరూ ఊహించలేకపోవడంతో అందరూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
తమ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తే వేలాదిగా ప్రజలు తరలివస్తారని కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వైసీపీ నేతలు జనసమీకరణ చేసినా ఇంతమంది కనబడరని టిడిపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. తమ అధినేత నిర్భయంగా ప్రజల మద్య తిరుగుతుంటే సిఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తే ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించినట్లుగా దుకాణాలన్నీ మూయించివేసి, బ్యారీకేడ్లు, పరదాలు మాటున వచ్చి వెళ్ళిపోతుంటారని టిడిపి నేతలు ఎద్దేవా చేస్తుంటారు. వైసీపీ నేతలు జనసమీకరణ చేయకపోతే సిఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనాలే కనబడరని ఎద్దేవా చేస్తుంటారు.
బటన్ నొక్కి సంక్షేమ పధకాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వస్తున్నా జనసమీకరణ చేయాల్సిరావడం, కేవలం పలకరింపులు, ధైర్యం చెప్పేందుకు వచ్చే ఓ మాజీ ముఖ్యమంత్రి కోసం స్వచ్ఛందంగా వేలాదిమంది ప్రజలు తరలివస్తుండటం గమనిస్తే ప్రజాధారణ ఎవరికి ఉందో అర్దం అవుతుంది.
కర్నూలులో చంద్రబాబు నాయుడు పర్యటనకు పోటెత్తిన జనాన్ని చూస్తే వారు కూడా ‘మూడు రాజధానుల పిట్టకధ’ను నమ్మడం లేదని, వారు కూడా అమరావతినే రాజధానిగా కోరుకొంటున్నారనే విషయం కూడా స్పష్టం అవుతోంది. అమరావతి పట్ల కర్నూలు ప్రజల అభిప్రాయం స్పష్టం అయ్యింది కనుక ఇక నుంచి టిడిపి అమరావతి అంశాన్ని గట్టిగా నొక్కి చెప్పగలిగితే మూడు రాజధానులతో మొదలైన ప్రాంతీయద్వేషాలు కూడా చల్లారుతాయి. అప్పుడు ప్రజలందరూ ఒక్కతాటిపైకి వచ్చి టిడిపిని గెలుపుబాట పట్టిస్తారు.



