టిడిపికి, చంద్రబాబు నాయుడుకి వచ్చే ఎన్నికలే చివరి ఎన్నికలని దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలకి గుండెలు అదిరిపోయేలా విజయనగరం జిల్లా ప్రజలే సమాధానం చెప్పారు.
శుక్రవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు బొబ్బిలిలో రోడ్ షోకి వేలాదిగా ప్రజలు తరలివచ్చి జేజేలు పలికారు. ఆ జనాన్ని చూస్తే బొబ్బిలి పట్టణంలో ప్రజలందరూ తరలివచ్చేశారా… అన్నట్లు అనిపించింది. రోడ్లన్నీ జనాలతో కిక్కిరిసి నిండిపోయాయి. చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం మూడు గంటలకి తెర్లాం, బాడంగి, పెరుమాళి, నందిగాం, రెజేరు, పినపెంకి, కారాడ, అలజంగి, గొల్లపల్లి మీదుగా రోడ్ షో చేస్తూ బొబ్బిలికి బయలుదేరారు. దారిపొడవునా ప్రజలు ఆయనకి ఘనస్వాగతం పలికారు. ఆయన వారిని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ ముందుకు సాగారు. దీంతో గంటలో బొబ్బిలి చేరుకోవలసిన చంద్రబాబు నాయుడు సుమారు 5 గంటలు ఆలస్యంగా చేరుకొన్నారు. అయినప్పటికీ బొబ్బిలి ప్రజలు ఆయన రాక కోసం ఓపికగా ఎదురుచూస్తూ నిలబడ్డారు.
చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా రాజాం, బొబ్బిలి పట్టణాలు టిడిపి తోరణాలు, జెండాలతో పసుపు రంగు పులుముకొన్నాయి. కార్యకర్తలు బైకులకి టిడిపి జెండాలు పెట్టుకొని పట్టణంలో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహిస్తూ సందడి చేశారు. చంద్రబాబు నాయుడు బొబ్బిలిలో మల్లమ్మదేవి పార్కు వద్ద నిర్వహించిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన సిఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేశాడని, వైసీపీ పాలనతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. రాష్ట్ర విభజనతో దెబ్బ తిన్న రాష్ట్రాన్ని తాను గాడిన పెట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేశానని, కానీ మూడున్నరేళ్ళ జగన్ పాలనతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వలననే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు చంద్రబాబు నాయుడు. కనుక ప్రజలు మరోసారి వైసీపీకి, జగన్కి అవకాశం ఇస్తే ఇక రాష్ట్రంలో ఎన్నటికీ కోలుకోలేదనన్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపిని గెలిపిస్తే తాను రాష్ట్రాన్ని చక్కదిద్దుతానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం విజయనగరం జిల్లా రైతులతో భేటీ అవుతారు. తర్వాత విజయనగరం పట్టణంలో రోడ్ షోలో పాల్గొంటారు. మళ్ళీ మధ్యాహ్నం పార్టీ నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం పట్టణంలో కోట జంక్షన్ వద్ద భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు.



