అన్ని దేవాలయాలలో తనిఖీలు… అవసరమే!

Chandrababu Naidu: Inspections in All Temples Required

తిరుమల ఏడుకొండల వేంకటేశ్వర స్వామిని తలుచుకోవడం మరిచిన భక్తులు కూడా ఇప్పుడు నిత్యం తలుచుకునేలా చేస్తోంది తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం. కేంద్ర ప్రభుత్వం మొదలు దేశంలో పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు, వివిద రంగాల ప్రముఖులు దీని గురించి తమ అభిప్రాయాలూ వెల్లడిస్తూ స్వామివారిని తలుచుకోవడం చూస్తే స్వామివారి మహిమ, జగన్లీల అనుకోకతప్పదు.

ADVERTISEMENT

మద్యంలో కల్తీ అంటే అర్దం చేసుకోవచ్చు కానీ తిరుమల శ్రీవారి ప్రసాదంలో కూడా కల్తీయేనా?అని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, జీవితంలో ఎన్నడూ ఉల్లి, వెల్లుల్లి కూడా ముట్టని శాఖాహారులు ‘మా చేత జగన్ జంతువుల కొవ్వు తినిపించాడే?’అని వాపోతున్నారు.

ఈ అంశంపై సిఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “నేను చిన్నప్పటి నుంచి ఆ ఏడుకొండలని చూస్తూ పెరిగాను. ఆ ఏడుకొండలవాడు మా ఇంటి ఇలవేలుపు. ప్రతీరోజూ ఆయనకు దణ్ణం పెట్టుకున్నాకే ఏ పనైనా మొదలుపెడతాను.

దేశంలో కోట్లాదిమంది భక్తులు జీవితంలో ఒక్కసారి తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన ప్రసాదం తిని తరించాలనుకుంటారు. అలాంటి భక్తుల మనోభావాలను జగన్‌ ప్రభుత్వం దెబ్బతీసింది. తిరుమల పవిత్రత, ప్రతిష్టకి భంగం కలిగించింది.

బయట మార్కెట్లో కేజీ నెయ్యి రూ.600-700 పైనే ఉంటే అది రూ.320కి ఎలా లభిస్తుంది?అని ఆలోచిస్తేనే అది కల్తీ నెయ్యి అని అర్దమవుతోంది. కానీ జగన్‌ రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరమే కాదు చివరికి స్వామివారి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు.

ఈ నేపధ్యంలో రాష్ట్రంలో అన్ని ప్రధాన దేవాలయాలకు సరఫరా అవుతున్న నెయ్యి, నూనె, ఇతర దినుసుల నాణ్యతపై భక్తులకు సహజంగానే అనుమానాలు మొదలవుతాయి. కనుక రాష్ట్రంలో అన్ని దేవాలయాలలో తనిఖీలకు ఆదేశించాను.

ఇటువంటి అపచారాలు రాష్ట్రానికి మంచిది కాదు. కనుక తిరుమలలో జరిగిన ఈ అపచారానికి సంప్రోక్షణ జరిపించాలని భావిస్తున్నాము. దీని గురించి తిరుమల వేద పండితులతో మాట్లాడుతున్నాము. దేవుడితో ఆటలాడుకునే వారిని ఆ దేవుడే శిక్షిస్తాడు,” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

ADVERTISEMENT
Latest Stories