చంద్రబాబు ప్రశ్నలకు ఆరోపణలే సమాధానాలా?

ys-jagan-chandrababu

ఇటు చంద్రబాబు నాయుడు ప్రజా గళంతో ప్రజల మద్యకు వచ్చి జగన్‌ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుంటే, అటు జగన్మోహన్‌ రెడ్డి కూడా ‘మేమందరం సిద్దం’ పేరుతో ‘పరదాలు పక్కన పెట్టి’ ప్రజల మద్యకు వచ్చి సంక్షేమ పధకాల గురించి చెప్పుకొని, చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను విమర్శిస్తున్నారు.

అయితే జగన్మోహన్‌ రెడ్డి సంక్షేమ పధకాలతో రాష్ట్రంలో కొంత మందికి మేలు చేశామనే చెప్పుకోగలుగుతున్నారే తప్ప రాష్ట్రాభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదు. నిన్న ప్రొద్దుటూరులో అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడుని వేలెత్తి చూపుతూ ఆరోపణలు చేశారు.

ADVERTISEMENT

ఇవాళ్ళ రెండో రోజు నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో “ఇంత చిన్న పిల్లాడిని నేను ఇన్ని సంక్షేమ పధకాలు అమలు చేశాను. రాజకీయాలలో చాలా సీనియర్నని చెప్పుకొంటున్న ఆ పెద్ద మనిషి ఒకటైనా చేయగలిగారా?” అని ప్రశ్నించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏ జిల్లాలో జగన్‌ పర్యటిస్తున్నా ఆ జిల్లాలో చంద్రబాబు నాయుడు చేసిన పనులు ఏవో ఒకటి కళ్ళకు కనిపిస్తూనే ఉంటాయి కదా?

అయితే ఐదేళ్ళ పాలనలో మీరేం చేశారంటూ చంద్రబాబు నాయుడు అడుగుతున్న ప్రశ్నలకు జగన్‌ వద్ద ఒకటే సమాధానం ఉంది. అదే ప్రజలకు మేలు చేయడం.

చంద్రబాబు నాయుడు ప్రజా గళం యాత్రలో భాగంగా గురువారం అనంతపురం జిల్లా రాప్తాడులో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏడు ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పమని జగన్మోహన్‌ రెడ్డిని డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా, సిపిఎస్ రద్దు, మధ్య నిషేధం, జాబ్ క్యాలండర్, మెగా డీఎస్సీ, కరెంట్ చార్జీల తగ్గింపు, పోలవరం పూర్తి చేయడం. గత ఎన్నికలలో జగన్‌ స్వయంగా ఈ హామీలన్నీ ఇచ్చారు కనుక వాటిలో ఎన్నిటిని పూర్తి చేశారని చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నించారు.

గత ఎన్నికలలో రాయలసీమలోని 52 ఎమ్మెల్యే సీట్లకు 49 వైసీపికి ఇచ్చి గెలిపిస్తే తిరిగి సీమ జిల్లాలకు, ప్రజలకు ఏమి మహోపకారం చేశారో చెప్పాలని చంద్రబాబు నాయుడు నిలదీశారు. అన్ని సీట్లు ఇచ్చి గెలిపించినా 5 ఏళ్ళలో ఏమీ చేయనప్పుడు, మరోసారి ఎందుకు వైసీపిని గెలిపించాలని చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు ప్రజల తరపునే ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డిని ఈ ప్రశ్నలు అడుగుతున్నారని గ్రహిస్తే వీటికి తప్పకుండా సూటిగా సమాధానాలు చెప్పి ప్రజలను మెప్పించగలిగితే రెండో ఛాన్స్ తప్పక లభిస్తుంది. కానీ సమాధానాలు చెప్పలేక ఆరోపణలు చేసి తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోవచ్చు కానీ వాటితో ప్రజలను మభ్య పెట్టడం అసంభవం అని గ్రహిస్తే మంచిది.
ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్‌ రెడ్డి ఇద్దరూ చెపుతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రజలు ఈసారి ఎవరిని ఎన్నుకోవాలో ఓ నిర్ణయానికి వచ్చేశారు. కనుక ఆ నిర్ణయాన్ని ఏ ‘మేలు’ మార్చలేకపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories