ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని కేటీఆర్, హరీష్ రావు పదేపదే ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పబట్టే రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు నిలువ చేయకుండా దిగువన ఏపీకి విడిచిపెడుతున్నారని కేటీఆర్ మళ్ళీ ఆరోపించారు.
ఆ ప్రాజెక్టులో మూడు పిల్లర్లు క్రుంగిపోయాయి కనుక గేట్లు మూసి నీళ్ళు నిలువ చేస్తే మొత్తం బ్యారేజి కూలిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ మంత్రులు సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు. కానీ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ తెలివిగా ఈ సమస్యని చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారు.
వారి ఆరోపణలను ఇద్దరు ముఖ్యమంతరులు గట్టిగా ఖండించకపోవడంతో తెలంగాణ ప్రజలు కూడా బీఆర్ఎస్ ఆరోపణలు నిజమని నమ్మే ప్రమాదం ఉంది.. అని చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డికి తెలియదనుకోలేము.
కానీ వారు ఆ ఆరోపణలను ఖండించకపోవడానికి చాలా బలమైన కారణమే ఉంది. ఇటువంటి ఆరోపణలను ఖండించడం మొదలుపెడితే వాటికి అంతే ఉండదు. టీడీపి మౌనంగా ఉంటేనే కేటీఆర్ ఇంతగా రెచ్చిపోతున్నారు. ఒకవేళ ఏపీ మంత్రులు, టీడీపి నేతలు సంజాయిషీలు ఇచ్చుకున్నా లేదా ఎదురుదాడి చేసినా ఇంకా రెచ్చిపోతారు. బీఆర్ఎస్ పార్టీకి అది బలమైన ఆయుధంగా మారుతుంది.
కనుక మౌనం వహిస్తున్నారు. తమ మౌనాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇలా వాడేసుకుంటోందని చంద్రబాబు నాయుడుకి, రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. కానీ ఎప్పుడు నెగ్గాలో… ఎప్పుడు తగ్గాలో బాగా తెలిసినవారు. బీఆర్ఎస్ పార్టీతో కత్తులు దూయడం వలన దానికి బలం చేకూర్చడం కంటే తమ మౌనం వలన తమకు కలిగే నష్టమే తక్కువని భావిస్తుండవచ్చు. కానీ ఇద్దరూ సమయం, సందర్భం వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా మరో ‘రిటర్న్ గిఫ్ట్’ ఇస్తారు. అంతవరకు బీఆర్ఎస్ పార్టీకి ఎదురే ఉండదు. చంద్రబాబు నాయుడుని ఎన్నైనా అనుకోవచ్చు.




