ఐదేళ్ళ జగన్ పాలనలో సంక్షేమ పధకాలు తప్ప అభివృద్ధి ఊసే ఎత్తలేదు. లక్షల కోట్లు విలువైన అమరావతిని పాడుబెట్టేసి మూడు రాజధానులు అంటూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి తీవ్ర నష్టం కలిగించారు.
పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ కంపెనీలను రప్పించాలనే ఆలోచన చేయకపోగా ఎవరూ ఏపీ వైపు కనీసం తొంగి చూడకుండా చేశారు.
పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యామ్, డయాఫ్రం వాల్ గురించి తప్ప మరేమీ మాట్లాడలేని మాజీ సాగునీటి శాఖ మంత్రి ఈ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో తెలియదని చెప్పేశారు. ఈ ప్రాజెక్టు గురించి నాకే అర్దం కాలేదు. ఇక జనాలకి ఏమర్దమవుతుందని తన అజ్ఞానాన్ని నిసిగ్గుగా సమర్ధించుకున్నారు.
మరో మంత్రిగారు, ఎమ్మెల్యే కలిసి బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసి వందల కోట్లు పోగేసుకున్నారు. మరో ఎంపీ కాకినాడ పోర్టునే కబ్జా చేయించారు. దశలవారీగా మద్య నిషేధం పేరుతో మద్యం కుంభకోణంతో వేలకోట్లు వెనకేసుకున్నారని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలే పార్లమెంటులో చెప్పారు.
ఐదేళ్ళ జగన్ పాలనలో ఎక్కడ చూసినా అరాచకం, అవినీతి, అక్రమాలు, రాజకీయ కక్ష సాధింపులు, సంక్షేమ పధకాల గోల తప్ప అభివృద్ధి ఊసే లేదు. అందుకే ప్రజలు జగన్ని గద్దె దించి చంద్రబాబు నాయుడుకి మళ్ళీ బాధ్యతలు కట్టబెట్టారు.
ఆయనకు ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర అవసరాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆర్ధిక పరిమితుల గురించి పూర్తి అవగాహన ఉంది. కనుక అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రచించుకొని శరవేగంగా అభివృద్ధి పనులు జరిపిస్తున్నారు.
అవి కాగితాల మీద కాక ప్రత్యక్షంగా కళ్ళకు కనబడుతున్నాయి కూడా. శరవేగంగా సాగుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు, అమరావతిలో మొదలైన పనులు, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తుండటం వంటివి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు.
కేవలం తొమ్మిది నెలలో రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిపధంలో నడిపిస్తుంటే, 5 ఏళ్ళలో ఏమీ చేయలేకపోయిన వైసీపీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్ వంటివారు పోలవరం పనులు, లులు గ్రూప్కి భూకేటాయింపుల గురించి సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుండటం సిగ్గు చేటు.
రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడే సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం పనులు చేయించారు. కానీ వడ్డించి విస్తరిలా రాష్ట్రాన్ని అందిస్తే కుక్కలు చించిన విస్తరిలా మార్చేసింది జగన్ ప్రభుత్వం.
కనీసం గుంతపడిన రోడ్లను కూడా పూడ్చలేకపోయినవారు అమరావతి, పోలవరం నిర్మిస్తున్న చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుండటం సిగ్గుచేటు కాదా?




