కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి, జగన్ క్యారెక్టర్ గురించి మాట్లాడితే చాలా కామెడీగా ఉంటుంది. ఈరోజు తాడేపల్లి ప్యాలస్లో జగన్ ఎమ్మెల్సీలని ఉద్దేశ్యించి మాట్లాడిన మాటలు విన్నప్పుడు తన లోపాల గురించి తానే స్వయంగా చెప్పుకున్నట్లు ఉండటం విశేషం. ఇంతకీ ఆయన ఏమన్నారో క్లుప్తంగా…
“రాజకీయాలలో అన్నిటికంటే ముఖ్యం క్యారెక్టర్, విశ్వసనీయత.” ఆయనలో ఆ రెండు గుణాలు కొరవడటం వలననే ఎన్నికలలో వైసీపి ఇంత దారుణంగా ఓడిపోయింది కదా?ఐదేళ్ళు అహంకారంతో విర్రవీగుతూ, ప్రతిపక్షాలను తుడిచిపెట్టేయాలని కుట్రలు, కుతంత్రాలు చేశారు కదా?
“ఎన్నికల ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా ఉన్నాయి. ఈవీఎం వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి.” అవే ఈవీఎంలతో తమకు 175/25 సీట్లు వస్తాయని జగన్ అనుకున్నారు కదా? ఒకవేళ వచ్చి ఉంటే అప్పుడు కూడా ఈవీఎంలను శకుని చేతిలో పాచికలని అనేవారా?
“రాష్ట్రంలో ప్రతీ అక్కచెల్లెమ్మకి సంక్షేమ పధకాలు అందాయని ధృవీకరించుకున్నాము. చరిత్రలో ఎన్నడూ లేనివిదంగా రాష్ట్రంలో 99 శాతం మందికి మేలు చేశాము.”
రాష్ట్రంలో 99శాతం మందికి మేలు చేస్తే వైసీపికి 39.37 శాతం మాత్రమే ఎందుకు వచ్చింది. ఈ 5 ఏళ్లలో పోరాటాలు తప్ప ప్రజలకు ఏమీ చేయని టిడిపికి 45.60 శాతం, జనసేనకి 6.85 శాతం ఎందుకు వచ్చిన్నట్లు?
“శిశుపాలుడు వంద తప్పులు చేసి అతని పాపాలు పండేవరకు శ్రీకృష్ణుడు ఎదురు చూసిన్నట్లు, మనం కూడా చంద్రబాబు నాయుడు వంద తప్పులు చేసేవరకు ఎదురు చూడాలి. ఆయన పాపాలు పండేందుకు ఎక్కువ సమయం పట్టదు.” రాష్ట్ర ప్రజలు కూడా సరిగ్గా ఇదేవిదంగా ఆలోచిస్తూ 5 ఏళ్ళు చాలా ఓపికగా జగన్ ప్రభుత్వం చేసిన పాపలన్నిటినీ లెక్కిస్తూ ఎన్నికలలో ఓడించి మూల కూర్చోపెట్టారు కదా?
“టిడిపి, జనసేనలకు ప్రస్తుతం హనీమూన్ పీరియడ్ నడుస్తోంది. కనుక అంతవరకు వాటిని ఎంజాయ్ చేయనిద్దాం.” నిజమే! వాటి హనీమూన్ పీరియడ్ ముగిసేవరకు అవి కూడా వైసీపి జోలికి రాకపోవచ్చు కనుక అంతవరకు జగన్ కూడా ఈవిదంగా పార్టీ నేతలను మళ్ళీ మభ్యపెడుతూ ఎంజాయ్ చేసుకోవచ్చు.
“ఈ ఎన్నికల ఫలితాలు సినిమాలో ఫస్టాఫ్ మాత్రమే. సెకండాఫ్ ఇంకా మిగిలే ఉంది. 2029 ఎన్నికలలో మనమే గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాము.”
ఇంతవరకు వైసీపి చూసింది ఫస్టాఫ్ కాదు ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇంకా మొదలవనే లేదు. కనుక సినిమా ముగిసేసరికి వైసీపి ఏవిదంగా ఉంటుందో అందరూ చూడాల్సిందే.




