టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుని విశాఖ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసారు. ఈరోజు ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ చేరుకొన్నప్పుడు అక్కడ మఫ్టీలో సిద్దంగా ఉన్న పోలీసులు అరెస్ట్ చేసి తమతో తీసుకుపోయారు. వారు కృష్ణాజిల్లా, హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసులని తెలుస్తోంది.
ఇటీవల గన్నవరంలో టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగానిర్వహించిన బహిరంగసభలో అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగన్ని ఉద్దేశ్యించి తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు, మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై 153A, 354A 1 (4), 504, 505 (2), 509 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి నేడు అరెస్ట్ చేశారు.
వైసీపీ మంత్రులు, కొడాలి నాని వంటి ఎమ్మెల్యేలు టిడిపి నేతలను ఉద్దేశ్యించి చాలా అవహేళనగా మాట్లాడుతుంటారు. వాటిపై టిడిపి పిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోరు. కానీ వైసీపీ నేతలు ఫిర్యాదు చేయగానే టిడిపి నేతలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తుంటారు. ఇందుకు అయ్యన్న పాత్రుడు అరెస్ట్ తాజా ఉదాహరణ.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, టిడిపి యువనేత నారా లోకేష్ కూడా సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించి తీవ్ర విమర్శలు చేస్తుంటారు. గత నెల చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని తంబళ్ళపల్లిలో పర్యటించినప్పుడు వైసీపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. అప్పుడు వైసీపీ- టిడిపి కార్యకర్తల మద్య ఘర్షణలు జరిగాయి. అందుకు పోలీసులు చంద్రబాబు నాయుడుతో సహా పలువురు టిడిపి నేతలపై హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.
అలాగే యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్పై ఇంతవరకు 26కి పైగా కేసులు నమోదు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లను అరెస్ట్ చేసేందుకు సాహసించ లేకపోతున్నారు. చేస్తే టిడిపికి రాజకీయంగా మైలేజీ కల్పించిన్నట్లవుతుందని వైసీపీ ప్రభుత్వం వెనుకంజవేస్తున్నట్లుంది. బహుశః అందుకే టిడిపిలో మిగిలిన ముఖ్యనేతలపై కేసులు నమోదు చేసి ఈవిదంగా అరెస్టులు చేస్తున్నట్లున్నారు.



