సంక్రాంతి కానుకగా “ఖైదీ నంబర్ 150”గా సిల్వర్ స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇవ్వబోతున్న మెగాస్టార్ చిరంజీవి, మొదటిసారిగా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. “మీలో ఎవరు కోటీశ్వరుడు” షో ద్వారా డిసెంబర్ మొదటి వారం నుండి బుల్లితెరపై మెగాస్టార్ హవా ఉంటుందని ముందుగా వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే, డిసెంబర్ మొదటి వారం గడిచి, రెండవ వారంలోకి ప్రవేశించినా “మీలో ఎవరు కోటీశ్వరుడు” గురించి ఎలాంటి సమాచారం లేదు.
దీంతో ఇప్పట్లో బుల్లితెరపై ప్రసారం కాదా? లేక కొత్త సంవత్సరం కానుకగా బుల్లితెరపై సందడి చేస్తాడా? అసలింతకీ ఈ ఆలస్యానికి కారణం ఏమిటో అర్ధం కాక మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన “పెద్ద నోట్ల రద్దు” నిర్ణయం ఈ కార్యక్రమంపై ప్రభావితం చూపిందా? అన్న కోణంలో సినీ జనాల్లో చర్చలు జరుగుతున్నాయి. నవంబర్ లో హల్చల్ చేసిన ప్రోమోలలో ప్రశ్నలు సంధించి, జవాబు చెప్పిన వారిని కోటీశ్వరుడ్ని చేసే బాధ్యత తనదంటూ మెగాస్టార్ చెప్పిన డైలాగ్ లు కేవలం ప్రోమోలకే పరిమితమా?
ఏది ఏమైనా “ఖైదీ నంబర్ 150” విడుదలకు ముందు “మీలో ఎవరు కోటీశ్వరుడు”తో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకోవాలన్న మెగాస్టార్ ప్రతిపాదనలు ఏమయ్యాయో తెలియక మెగా అభిమానులు నిరాశలో ఉన్నారు. బహుశా సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు మెగాస్టార్ గారి దర్శనం ఏమైనా ఉంటుందేమోనన్న ఆశలో అభిమానులు నిరీక్షిస్తున్నారు. అయితే మరో వైపు మెగాస్టార్ మాత్రం తన ‘ఖైదీ’ సినిమాను పూర్తి చేసే కార్యక్రమంలో బిజీగా గడుపుతున్నారు.



