ఎక్కడ ఏం సాధించినా లేకున్నా సొంత ఊరిలో ‘మనవాడు’ అనే మమకారం ప్రతి ఊరి ప్రజలకు ఉంటుంది. అయితే అలాంటి ‘మనవాడు’ ఒక స్థాయికి వెళితే ఊరికి ఏమైనా ఉపకారం చేస్తారన్న ఆశ చిగురిస్తుంది. అలా ఆశ చిగురించిన క్రమంలోనే తానూ పుట్టిన ఊరికి కాస్త సహాయం చేయాలంటూ మొగల్తూరు వాసులు మెగాస్టార్ చిరంజీవి చాలా సందర్భాలలో విన్నవించుకున్నారు.
ముఖ్యంగా భావితరం ఆడపిల్లలు చదువు కోసం చాలా దూరం పోతున్నారని, వారికి ఒక విద్యాలయం నిర్మించాల్సిందిగా కోరామని చిరు ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టిన మొదట్లో చెప్పారు. కానీ, ఎటువంటి సాయం చేకపోయినా, తమను అవమానకర రీతిలో పంపేసారని అప్పట్లో సొంత ఊరి వాసులు తీవ్రంగా మండిపడ్డారు. ఆ ఆవేదన పర్యవసానం అప్పటి ఎన్నికల ఫలితాలలో స్పష్టంగా కనపడింది. ఈ పరిణామాలతో సొంత ఊరికి గానీ, ఊరి ప్రజల కోసం గానీ చిరు ఏమీ చేయలేదన్న భావన అన్ని వర్గాల ప్రజలలో ఏర్పడింది. అయితే మరి ఈ ముద్రను చేరిపేయాలనుకుంటున్నారో ఏమో గానీ ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు.
ముందుగా తన సొంతూరు మొగల్తూరు సందర్శించనున్న చిరంజీవి, అక్కడి నుంచి దత్తత తీసుకున్న పేరుపాలెం గ్రామానికి ర్యాలీగా బయలుదేరతారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద రాజ్యసభ సభ్యుడి హోదాలో ఆయన పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని, గ్రామంలో అభివృద్ధి పనుల కోసం ఇటీవలే తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 5 కోట్లను కేటాయించారు. సదరు అభివృద్ధి పనులకు నేడు చిరంజీవి శ్రీకారం చుట్టనున్నారు. చిరు పర్యటన నేపథ్యంలో మొగల్తూరు, పేరుపాలెంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మెగా అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు.



