రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో మీడియా అనేది అత్యంత కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు టీడీపీ, వైసీపీ, జనసేన అనే మూడు పార్టీల మధ్యనే కీలకంగా తిరుగుతాయి.
అలాగే ఈ మూడు పార్టీలకు సంబంధించి ఎల్లో మీడియా, బ్లూ మీడియా రాష్ట్ర రాజకీయాలలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించినప్పటికీ ఎర్ర మీడియా కూడా తనవంతు కథ నడిపిస్తుంది.
అలాగే అటు తెలంగాణలో సైతం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ లతో పాటుగా బీజేపీ కూడా కొంత ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఇక్కడ కూడా గులాబీ మీడియా, కాంగ్రెస్ మీడియా అంటూ తెలంగాణ రాజకీయం రెండు రంగులుగా మారి తమ తమ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
ఈ నేపథ్యంలో పార్టీ జెండా రంగుల మాదిరి ఒక్కో పార్టీకి ఒక్కో మీడియా మద్దతు లభిస్తుంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో పసుపు, ఎరుపు, బ్లూ, గులాబీ, కాంగ్రెస్ అంటూ మీడియా పంచరంగుల చిలక మాదిరి కళకళలాడుతుంటే ఇప్పుడు ఆ కళను బొగ్గు మసి కమ్మేస్తుంది.
తెలంగాణలో మొదలైన మీడియా రాజకీయంలోకి రాజకీయ నాయకులు వేలు పెట్టారో లేక రాజకీయ నాయకుల రాజకీయంలోకి మీడియానే తలపెట్టిందో తెలియదు కానీ మొత్తానికి మీడియానే మీడియా వార్తలలో హల్ చల్ చేస్తూ తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి – ఒక మహిళా ఐఏఎస్ పై NTV లో ప్రచారమైన ఒక అనుచిత కథనం దగ్గర మొదలైన ఈ రాజకీయం చివరికి చిలికి చిలికి ఇప్పుడు బొగ్గు టెండర్ల వరకు విస్తరించింది.
సింగరేణికి సంబంధించిన 1600 కోట్ల విలువైన నైవీ బొగ్గు టెండర్ల విషయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి, NTV అధినేత నరేంద్ర చౌదరి మధ్య మొదలైన పంచాయితీ ntv రిపోర్ట్రర్ అరెస్టు వరకు వెళ్ళింది అంటూ ABN నిర్దారిస్తే,
ఇక ఇది రెండు బడా న్యూస్ ఛానెల్స్ మధ్య మొదలైన ఆధిపత్య రాజకీయంలో భాగం అంటూ మరికొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అలాగే ఇక బిఆర్ఎస్ గులాబీ ఛానెల్స్ వారికి నచ్చిన విధంగా గులాబీ రంగు కథనాలు వారు వండి వడ్డిస్తుంటే,
కాంగ్రెస్ కూడా తమ రంగు మీడియాతో ఆ కథనాలను తిప్పుకోడుతూ తన వర్షన్ తానూ చెప్పుకుంటూ పోతుంది. అయితే ఇందులో ఒక్కో మీడియా ఒక్కో రంగులో వార్తలను వండి వడ్డిస్తున్నారే తప్ప అసలు వాస్తవాలు ప్రజలకు తెలియనివ్వడం లేదు.
అయితే ఇందులో NTV రిపోర్ట్ అరెస్టు ఖండించే విషయంలో బిఆర్ఎస్, వైసీపీ ఒకే తాటి మీదకు రాగ, తాజాగా బిఆర్ఎస్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ – భట్టి, కోమటిరెడ్డి మధ్య ఈ బొగ్గు టెండర్ల కోసం పంచాయితీ నడుస్తుందని, అందులో అమాయక ఐఏఎస్ లను, టీవీ జర్నలిస్ట్ లను బలిచేసారంటూ ఆరోపించారు.
రాజకీయ నాయకుల అవినీతిని ఎత్తి చూపించాల్సిన మీడియా ఛానెల్స్, రాజకీయ పార్టీల అక్రమాలను తవ్వి తీయాల్సిన మీడియా నే ఇప్పుడు బొగ్గు మసి అంటించుకుని వార్తలలో నిలవడం తెలంగాణలో మారబోతున్న రాజకీయానికి నిదర్శనంగా భావించాలా.?






