జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశారు. అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్న ఫళంగా తన స్టాండ్ మార్చుకుని టీడీపీనే టార్గెట్ గా రాజకీయం చేస్తున్నారు ఆయన. నిన్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీజేపీ అద్యక్షుడు అమిత్ షా రాసిన లేఖను,ఆ తర్వాత శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని చూస్తే ,రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని అర్ధం అవుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు
దీనితో స్పెషల్ స్టేటస్ కోసం కార్యాచరణ రూపొందించే పనిలో పడ్డారు ఆయన. ఈ పరిణామాలపై చర్చించడానికి వామపక్షలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలలో వామపక్షాలకు పెద్దగా ఆదరణ లేకపోయినా వారితో ముందుకు నడవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
అయితే దీనికి కారణాలు లేకపోలేదు. జనసేన స్థాపించి నాలుగు సంవత్సరాలైనా ఇప్పటికి సరైన పార్టీ నిర్మాణం లేదు. పార్టీకి అధికార ప్రతినిధులని నియమించడానికే పవన్ కళ్యాణ్ కు నాలుగు సంవత్సరాలు పట్టింది. అటువంటి నిర్మాణంతో రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలపడం అంత తేలిక కాదు. దీనితో పోరాటాలు చెయ్యడం దిట్ట అయిన కమ్యూనిస్టులను వాడుకోబోతున్నారు. జనసేన వీక్ నెస్లను కమ్యూనిస్టుల వెనుక దాచే ప్రయత్నం చేస్తున్నారా?



